అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" న దైవాంశో దదాత్యన్నం
న రుద్రః రుద్రమర్చతి,
నా నృషిః కురుతే కావ్యం
న విష్ణుః పృథివీ పతిః "
" దైవాంశ లేని వాడు అన్నదానం చేయలేడు. రుద్రాంశ లేని వాడు దైవపూజ చేయలేడు. ఋషికాని వాడు కావ్యమును వ్రాయలేడు. విష్ణువు అంశలేని వాడు రాజుకాలేడు " అని భావం.
అన్నదానం చేయడం అంత చిన్న విషయం కాదు. మాయ దానిని చేయనివ్వదు. ఒకసారి అన్నదానం చేయడం వలన ఎవరెవరికి పుణ్యం కలుగుతుందో చూద్దాం. అన్నదానం చేద్దాం అని సంకల్పం చేసినవారు, ఏర్పాట్లు చేసినవారు, ధనం సమకూర్చినవారు, సరుకులు తెచ్చినవారు, వండినవారు, వడ్డించినవారు, తిన్నతరువాత శుభ్రం చేసినవారు, సరుకులు తేవడంనుంచి శుభ్రం చేసేవరకూ ఏర్పాట్లు చేసినవారు - వీరందరికీ అన్నదానపుణ్యంలో భాగం వస్తుంది.
ఈ పుణ్యాత్ములందరూ ఒకచోట చేరితేనే అన్నదానం సాధ్యమవుతుంది. దానికి దైవాంశ తోడవాలి. అందుకే దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు అని తెలియచేస్తూంది సుభాషితం.
సృష్టికి అన్నమే మూలం. ఇదే " పురుష శక్తి/స్త్రీ అండం " గా మారుతుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలియచేస్తున్నాయి ఉపనిషత్తులు.
విష్ణుసహస్రంలో స్వామిని " అన్నం అన్నాద ఏవ చ " అని ప్రార్ధిస్తాం. అంటే అన్నం ఆయనే, అన్నాన్ని ఇచ్చేదీ ఆయనే, ఆ అన్నాన్ని ( ఉదరంలోని జఠర అగ్ని ద్వారా ) గ్రహిస్తూన్నది ఆయనే.
ఇలా అన్నదానం జరగాలంటే తగిన ప్రేరణ కూడా ముఖ్యం. ప్రేరణే సరిపోదు. ఇంకొకరు అందరూ సౌకర్యవంతంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవసరమయిన చక్కటి ఏర్పాటు ( లింకు ) తయారు చేయాలి.
దానికని కొందరికి అమ్మవారు ఆ పనులు అప్పగిస్తారు. పుణ్యాత్ములు.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment