Posts

Showing posts from August, 2024

మనకు మనమే మిత్రులం, శతృవులం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " బంధురాత్మాత్మనస్తస్య      యేనాత్మైవాత్మనా జితః !   అనాత్మనస్తు శత్రుత్వే        వర్తేతాత్మైవ శత్రువత్  "                    - భ.గీత 6:6 " మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు.  అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు " అన్నారు పరమాత్మ.  అనగా జితేంద్రియునకు మనస్సు,  ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తిసిద్ధికై మిత్రునివలె సహకరిస్తాయి . జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు,శరీరము శత్రువులవలె ప్రవర్తించి  లక్ష్యసాధనకు అవరోధకములుగా నిలుస్తాయి. ఎంత అద్భుత విషయం. మనస్సు ఇంద్రియములు అదుపులో ఉంచుకుంటే జీవితం ఆనందమయంగా సాగిపోతుందని, ఏ కష్టాలు దరిచేరవని ఎంత చక్కగా తెలియచేసారు పరమాత్మ. వాల్మీకి రామాయణంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. " ఇంద్రియాణి పురాజిత్వా    జితం త్రిభువనం త్వయా    స్మరద్భిరివ తద్వైరం   ఇంద్రియైరేవ నిర్జితః " రావణుడు మరణించగానే మండోదరి అంటుంది రావణుడిని ఉద్దేశించి " ఇంద్రియాలు నీ అధీనంలో...

మానవ శరీరం దుఃఖాలయం, అశాశ్వతం అన్నారు పరమాత్మ గీతలో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " మాముపేత్య పునర్జన్మ    దుఃఖాలయ మశాశ్వతం,   నాప్నువంతి మహాత్మానః    సంసిద్ధిం పరమాం గతాః "               ‌‌ - భ.గీత 8:15 పరమాత్మ ఈ జీవితాన్ని " దుఃఖాలయం, అశాశ్వతం " అన్నారు. ఎంత అద్భుతమైన పదాలు.  రామాలయం అంటే రాముడు కొలువై ఉన్నది. శివాలయం అంటే శివుడు కొలువై ఉన్నది. మరి దుఃఖాలయం అంటే దుఃఖం కొలువై ఉన్నది అని కదా అర్ధం. ఈ జీవితం దుఃఖం తో కూడుకున్నది పైగా అశాశ్వతం. మరి ఇటువంటి జీవితం కోరుకోవడం దేనికి. పరమాత్మని నమ్ముకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం గిట్టడం ఉండదని స్వామి చెబుతున్నారు. వివేకానందుడు భయాన్ని వదిలేయమన్నారు. భయమే దుఃఖానికి మూలం. ఆయన ఓ చక్కటి కధచెప్పారు. వంటలన్నీ తయారు చేసి పెట్టి అక్కడివారు ప్రక్కకు వెళ్ళారు ఏదోపనిమీద. ఓ కుక్క వచ్చింది. తినదామని ఎదరికి వెళ్ళడం, ఎవరైనా వచ్చి నడ్డివిరగ్గొడతారేమో అని ఇటూఅటూ చూడడం. ఒకవేళ ఏదో కొద్దిగా తిన్నా భయంతో తిన్న తిండి దానికి సంతోషమేమి కలిగిస్తుంది. మానవజీవితం కూడా అంతే. ఎప్పుడూ ఏదోదానిగురించి భయపడుతూ బ్రతికే జీవితం అవసరమా అన్నారు వివేకానందుడు. అందుకనే ని...

దేవుని మీద భక్తి కలగడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏 " నాహం వేదైః నతపసా    నదానేన నచేజ్యయా,   శక్యా ఏవంవిధో ద్రష్టుం    దృష్టవాన్ అసి మాంయధా "              - భ.గీత 11.53 గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు. మరి ఇంతకీ " భక్తి " అంటే ఏమిటి.  " శ్రవణం కీర్తనం విష్ణోః    స్మరణం పాద సేవనం,    అర్చనం వందనం దాస్యం    సఖ్యం ఆత్మ నివేదనం "                - భాగవతం వ్యాసర్షి భక్తిగురించి చెబుతూ వీటిలో ఏది చేసినా ఉత్తమమే అన్నారు. ప్రవచనాలు వినగా వినగా భక్తి కొంచమైనా అంటుకుంటుంది. నాస్తి సంశయం. ఉపనిషత్తులు ఏమిచెబుతున్నాయంటే : " భక్తిమార్గేపి భవతరణార్ధే    ఏకాదశభూమికాః  ప్రతిపాదితాః "    - జీవుడు తరించడానికి భక్తిమార్గంలో 11 భూమికలు ఉంటాయని తెలియచేసాయి. ఆ భూమికలు ఏమిటో తెలుసుకుందాం. 1. మహాత్ములను సేవించడం 2. సత్పురు...

విగ్రహారాధన అవసరమా - మంచిదేనా - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 "శ్రీరస్తు శుభమస్తు""🙏 " ఏవం సతతయుక్తా    యే భక్తాస్త్వాం పర్యుపాసతే,    యే చాప్యక్షర మవ్యక్తం  ‌  తేషాం కే యోగవిత్తమాః "              - భ.గీత 12:1 విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది.  " నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు. వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు. ఒకరిమీద అభిమానం కలగాలంటే అతని విభూతులు ( శక్తులు ), రూపం తెలియాలి. అప్పుడు పని సులభమవుతుంది. అందుకే పరమాత్మ తన విభూతులు తెలియచేసి తన విశ్వరూపాన్ని చూపించి తరువాతే భక్తి గురించి తెలియచేసారు. నన్ను నమ్ముకో, అన్నీ నేను చూసుకుంటానన్నారు. " విశేషేణ గ్రహతి ఇతి విగ్రహః " - విగ్రహము అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి. విగ్రహారాధన గురించిన ఓ విషయం చూద్దాం.  వివేకానందుడు " సర్వమతస...

ధర్మసంరక్షణ కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యదా యదాహి ధర్మస్య    గ్లానిర్భవతి భారత,   అభ్యుత్థానమధర్మస్య    తదాత్మానం సృజామ్యహం "                    - భ.గీత 4:7 ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు.  ఆదిశంకరులు కంచిపరమాచార్యులు శృంగేరీపీఠాధిపతి రమణమహర్షి వివేకానందులు లాంటివారి కృషి పరమాత్మ ఏర్పాటే.  వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ).  ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివారు యాగాలు అవీ చేసే అవకాశమెక్కడిది. మరి సనాతనధర్మం ఎలా రక్షింపబడుతుంది. ఇన్నిరకాలుగా చింతనచేసి కర్మకాండకన్నా జ్ఞానకాండయే గొప్పది ( సులువు అంటే అర్ధంవేరేగా తీసుకోవచ్చు ) అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెడితే రోజూ ఏదో ఒకసమయంలో జపమో శ్లో...

నేడు గోకులాష్టమి - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  నేడు పవిత్రమయిన గోకులాష్టమి. కలి ప్రవేశం జరిగిన తరువాత నారదులు దేశాటన చేస్తూ ఓ ప్రదేశానికి వచ్చేసరికి ఓ వింత కనబడుతుంది. ఓ యువతి కూర్చుని ఏడుస్తూంది. ఆవిడ ముందర ఇద్దరు ముసలివారు కొన ఊపిరితో పడుక్కుని ఉన్నారు. వారు ఆ యువతి పిల్లలని తెలుసుకుని నారదులు ఆశ్చర్యపోతారు. అదే విషయం అడుగుతారు. అప్పుడు ఆ యువతి ఇలా చెబుతుంది. తనపేరు భక్తి. ముసలివారుగా కొన ఊపిరితో ఉన్న పిల్లలు జ్ఞాన వైరాగ్యాలు. ఈ భక్తికి ఓ దాసి ఉండేది. ఆవిడ పేరు ముక్తి. ఈ నలుగురు కృష్ణపరమాత్మ పాదం భూమిమీద ఉన్నంతకాలం ఆడుతూ పాడుతూ హాయిగా గడిపారు. ఎప్పుడైతే పరమాత్మ భూమిమీద నుంచి తన పాదం తీసేసారో అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముసలివి అయిపోయాయి. ముక్తి " తన అవసరం ఇంక ఏముంది, మళ్ళీ మీరు బాగుపడి పిలిస్తే వస్తాను " అని చేప్పి ముక్తిపధం ( వైకుంఠం )కి వెళ్ళిపోయింది. భక్తి ఇద్దరు పిల్లలతో భూమి అంతా తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చేసరికి భక్తికి యవ్వనం వచ్చింది కాని పిల్లలలో మాత్రం మార్పులేదు. ఆ ప్రదేశం బృందావనం, కృష్ణుడు నడయాడిన ప్రదేశం.  ఇక్కడో అద్భుత సత్యం ఉంది. భక్తితో బాగుపడి మళ్ళీ పిలుస్తే వస్త...

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణపరమాత్మ జయంతి. పరమ పవిత్రమయిన రోజు. శుభాకాంక్షలు. " అనన్యాశ్చింతయంతో    మాం ఏజనాః పర్యుపాసతే,   తేషాం నిత్యాభియుక్తానాం    యోగక్షేమం వహామ్యహం "                - భ.గీత 9:22 పరమాత్మ " ఇతరవిషయాలగురించి ఆలోచన చెయ్యకుండా నన్నే ఎవరు సేవిస్తారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను " అన్నారు. పాండవులను అలాగే ఆదుకున్నారు స్వామి. ఆఖరికి రాయబారానికి కూడా స్వయంగా వెళ్ళారు. పూజ్యులు గరికిపాటివారు ప్రవచనంచేస్తూ ఓ అద్భుతమయిన విషయం చెప్పారు ( వ్యాసభారతంలో ఉన్న విషయం ఇది ). ఆయనకు, విన్నవారికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పరమాత్మ రధం నడుపుతున్నారు కురుక్షేత్రంలో. అర్జునుడు రధంలో నుంచుని యుద్ధం చేస్తున్నాడు. ఒకరిని కొట్టడమో, నిరాయుధుడిని చేయడమో అయిన తరువాత రధాన్ని తిన్నగా పోనివ్వాలా, ఎడమకు తిప్పాలా, కుడికి పోనివ్వాలా ఎలా తెలుస్తుంది సారధికి. పరమాత్మ సారధి, కూర్చుని ఉన్నారు, ఎక్కువదూరం కనబడదు. అర్జునుడు నుంచుని ఉన్నాడు, దూరంగా చూడగలడు, ఎటువెడితే ఉపయోగమో తెలుసుకోగలడు. ఒక చేతిలో ధనుస్సు, రె...

భగవంతుడిమీద నమ్మకం ఉన్నవారు ఇంకదేనికి బాధపడరు - చీమలపాటి సూర్యనారాయణ

🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యం లబ్ధ్వా చాపరం లాభం     మన్యతే నాధికం తతః,   యస్మిన్ స్థితో న దుఃఖేన           గురుణాపి విచాల్యతే  "                   - భ.గీత 6:22 " పరమాత్మప్రాప్తిరూప లాభమును పొందినవాడు ( అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు.   బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు " అన్నారు పరమాత్మ.    భక్త రామదాసు ప్రజలు కట్టిన పన్నులను ప్రభుత్వానికి కట్టకుండా ఆ డబ్బుతో రాములవారికి గుడి కట్టించాడు, నగలు చేయించాడు. జైలులో పెట్టించినా, శిక్షించినా తొందరగా వచ్చి రక్షించమని రాముడినే వేడుకున్నాడు కాని రాజును వేడుకోలేదు.  పోతనామాత్యుడిని భాగవతాన్ని ఎవరికయినా ఓ రాజుకి అంకితమిస్తే కావలసినంత ధనం ఇచ్చి సత్కరిస్తారని ఎందరో నచ్చచెప్పాలని చూసారు. పోతన ససేమిరా అన్నారు. రాములవారికి అంకితమిచ్చారు, నా బాగోగులు ఆయనే చూసుకుంటారు అని నమ్మారు. త్యాగయ్యని అన్నగారు కూడా " ఈ పాటలు కూడు పెట్టవు, ఏ ...

మనస్సులో కూడా ఇంకొకరి కీడు తలచకూడదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " శ్రేయాన్ స్వధర్మో విగుణః    పరధర్మాత్ స్వనుష్ఠితాత్,   స్వభావనియతం కర్మ    కుర్వన్నాప్నోతి కిల్బిషం "                - భ.గీత 18:47 " బాగుగా ఆచరించబడిన పరధర్మంకంటే గుణరహితమైననూ స్వధర్మాచరణమే మంచిది/శ్రేష్ఠమయినది. స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టిపాపములును ఏమాత్రమూ అంటవు ". స్వధర్మమే ఉత్తమమని చెప్పారు పరమాత్మ.  వైద్యుడు అత్యవసరమయితే, ప్రాణానికే ముప్పు అయినప్పుడు కాలో చెయ్యో తొలగిస్తాడు. అంతేకాని " అయ్యోపాపం " అని ఊరుకోడు. అది వృత్తిధర్మం. ఒక విషయం చూద్దాం. ఒకాయన మాంసంకొట్టు నిర్వహిస్తున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన కుటుంబీకులు దానిని నిర్వహిస్తున్నారు. స్వామి చెప్పినది " అదేమీ జీవహింస క్రిందకూరాదు, అతనికి పాపమూ అంటదు " అని.  ఆ కొట్టుముందర బ్రతికున్న ప్రాణులను వ్రేలాడదీసి ఉంచుతాడు. ఒకాయన వచ్చి ఓ ప్రాణిని చూపిస్తాడు. కొందరికి అనిపిస్తుంది " అలా వాటిని వ్రేలాడదీయడమేమిటి, ఒకతను వచ్చి దానిని కొనడమేమిటి, కొట్టతను దానిని చంపి ఇవ్వడమేమిటి " అని. కొంద...

అమ్మవారి సృష్టి ఎంత అద్భుతమో - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " అంతకాలే చ మామేవ   స్మరన్ముక్త్వా కలేవరం   యః ప్రయాతి స మద్భావం   యాతి నాస్త్యత్ర సంశయః "                  - భ.గీత 8:5 " అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈవిషయమున ఎట్టి సందేహము లేదు " అన్నారు పరమాత్మ. అది అంత సులభం కాదు. త్రిగుణాల ప్రభావంనుంచి తప్పించుకోవడం కష్టం. పరీక్షలు పెడుతూనే ఉంటారు పరమాత్మ. " బ్రతికినన్నాళ్ళు నీ భజన చేతును,    మరణసమయమున మరతునేమో " అంటారు నరసింహ శతకకర్త. ప్రతీరోజూ దైవస్మరణ చేస్తూన్నా, మాయనుంచి తప్పించుకోలేరు. పోయే సమయంలో మనవణ్ణి " ఈరోజు శ్రీరామగాయత్రీజపం చేసావా, ఎంతచేసావు " అని అడగడు, వీధిలో కుక్క అరుస్తూంది చూడండ్రా అంటూ శరీరం విడుస్తాడు, మరుజన్మలో కుక్కగా పుడతాడు. కుటుంబసభ్యుల దైనందిక అవసరాలు, వృద్ధుల అనారోగ్యసమస్యలతోనే కొంచెం కలవరంచెందుతూంటారు సాధారణంగా కుటుంబ యజమానులు. కాని ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని ( ఇప్పుడు పిల్లుల్ని కూడా ) పెంచుకుంటూంటారు. వాటిని బయటకు తీసుకుని వెళ్ళడం, స్నానం చేయించడం, తిండి తినిపించడం...

వేలమంది ప్రయత్నిస్తే కొందరికే భక్తి కలుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " మనుష్యాణాం సహస్రేషు    కశ్చిద్యతతి సిద్ధయే,   యతతామపి సిద్ధానాం    కశ్చిన్మాం వేత్తి తత్త్వతః "            - భ.గీత 7:3 " వేలమంది వ్యక్తులలో, పరిపూర్ణత కోసం ఎవరూ ప్రయత్నించరు, మరియు పరిపూర్ణతను సాధించిన వారిలో, సత్యం గురించి ఎవరికీ తెలియదు " అన్నారు పరమాత్మ. ప్రవచనాలయినా కళ్ళు హృదయం తెరిచి వినడానికి ప్రయత్నించేది వేలమందిలో ఒకరు. అలా ప్రయత్నం చేసిన వేలమందిలో ఒకరు పరిపూర్ణతను పొందుతారు అని తెలుసుకోవాలి. స్వర్గలోకం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందంటారు ఎలా అండీ అని అడిగాడు ఒకాయన. పండితులు చెప్పినది కోట్లమందిలో ఒకడు అక్కడకు వెడతాడు నాయనా, పుణ్యం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడు. అందుకని అక్కడ ఎక్కువ మంది ఉండరు. అందుకని ఎప్పుడూ పరిశుభ్రంగా, అందంగానే ఉంటుంది అని. మరి ప్రవచనాలు వినడం వల్ల ఉపయోగమేమయినా ఉందా అని ఎవరికయినా సందేహం కలిగినా తప్పు పట్టకూడదు. సందేహం అంటూ వస్తేనే కదా నివృత్తి/పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ప్రవచానలలో ఏమి చెబుతారు, దేవీదేవతల మహిమలు, వేదాలు పురాణాలు శాస్త్రాలలోని విషయాలేగా. అటువంటి విషయాలు వినగా...

అతి ఎప్పుడూ అనర్ధమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నాత్యశ్నతస్తు యోగో2స్తి    న చైకాన్తమనశ్నతః,    నా చాతిస్వప్నశీలస్య    జాగ్రతో నైవ చార్జున "              - భ.గీత 6:16 " అతిగా తినేవారికి అస్సలు తినని వారికి, అతిగా నిద్రపోయే వారికి అస్సలు నిద్రపోని వారికి యోగాభ్యాసము అంటదు/పనికిరాదు " అన్నారు పరమాత్మ. యోగాభ్యాసము దేనికి. మనస్సు నిలకడగా అంటే అలలులేని సముద్రంలా నిశ్చలంగా ఉండడానికి. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అందుకని మితాహారం తీసుకోవాలన్నారు. అది ఎలాగో కూడా చెప్పారు. ఉదరాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలు ఘనపదార్ధం ( అన్నం మొ.గునవి ) తో నింపి ఒకభాగం ద్రవంతో నింపమన్నారు. ఒకభాగం ఖాళీగా ఉంచితే మితాహారం తీసుకున్నట్లుగా భావించాలి. ఖాళీకడుపుతో అసలు చెయ్యకూడదన్నారు. ఎంత అద్భుతంగా విపులంగా చెప్పారో చూడండి. ఖాళీకడుపు అయినా పొట్టనిండుగా ఉన్నా నిద్ర రావడానికి అవకాశముంది. మరి ఎత్తుపీటమీద కూర్చుంటే నిద్రమత్తులో క్రింద పడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. అలాగే క్రింద కూర్చోవడంకూడా కష్టమే కదా. అందుకని అంత ఎత్తు పల్లంక...

ఓం ఒకటే అక్షరం - అదే ప్రపంచశాంతికి మార్గదర్శి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ    వ్యాహరన్మామనుస్మరన్,    యః ప్రయాతి త్వజన్దేహం    స యాతి పరమాం గతిమ్ "                - భ.గీత 8-13  " ఈ యోగవిధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడనైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మికలోకములను పొందగలడు " అన్నారు పరమాత్మ అర్జునుడితో. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ( ఓం ఇతి ఏక అక్షరం ) అన్నారు పరమాత్మ. ఓం అనే ఒక అక్షరమే బ్రహ్మ/పరమాత్మ/చైతన్యం. ఈ సృష్టి అంతా ఓం అనే ఒక అక్షరం నుంచే వచ్చింది. ఓం ను జపించి తరించమన్నారు పరమాత్మ. సనాతనం ఏమి చెబుతూందంటే ఓం నుంచి నమః శివాయ అనే పంచాక్షరి పుట్టింది, దానినుంచి సృష్టి మొదలయ్యింది. ప్రళయకాలంలో జగత్తంతా నమశ్శివాయలోనూ, నమశ్శివాయ ఓం లోనూ లయమవుతుంది. మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అక్షరం అంటే నాశనంలేనిది అని. ఎంత అద్భుతమైన పేరుపెట్టారు అక్షరం అని. మంత్రపుష్పంలో " ఈశానాం సర్వవిద్యానాం " అంటాం. సర్వవిద్యలకు అంటే అన్ని అక్షరాలకు అధిపతి పరమాత్మ. అందుకే పిల్లలకి అక్షరాభ్యాసం చే...

" శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి " - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీమాత్రేనమః " 🙏 " శ్రావణ పౌర్ణమి - హయగ్రీవ జయంతి "  అమ్మవారు శ్రీలలితాదేవి మణిద్వీపంలో సింహాసనాధీశురాలై కొలువై ఉంటుంది. దుర్గాసూక్తంలో అమ్మవారిని " తాం అగ్నివర్ణాం " అని పూజిస్తారు. ఆవిడ అగ్నిరంగులో ( ఎరుపు పసుపు కలిసిన రంగులో ) మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడకి ఎప్పుడూ 16 ఏళ్ళే వయస్సు. అందుకే ఈ సృష్టి ఇంత అద్భుతంగా క్రమం తప్పకుండా నడుస్తూ ఉంది. ఆవిడ చుట్టూ వశిన్యాది వాగ్దేవతలు కూర్చుని ఆమెని స్తుతిస్తూ ఉంటారు. ఆ స్తుతే శ్రీలలితాసహస్ర ( రహస్య ) నామాలు. ఓ రోజు హయగ్రీవులు ( విష్ణువు ఒక అవతారం ) అమ్మవారి దర్శనానికి రావడం, ఆ స్తుతిని విని ఆనందించడం జరిగింది. ఈ విషయం అగస్త్యమహాముని తెలుసుకుని వాటిని తనకు తెలియచేయమని అడుగుతాడు హయగ్రీవుణ్ణి. ఆయన అవి రహస్యనామాలు, అమ్మవారి అనుమతిలేదు, కుదరదంటారు. వందల సంవత్సరాలు హయగ్రీవుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు అగస్త్యుడు. ఇంక అగస్త్యులు పట్టువదిలేలా లేరని తలచి హయగ్రీవులు " అమ్మా, అగస్త్యుడు మీ నామాలకోసం తపస్సు చేస్తున్నారు ఇవ్వమంటారా " అని అమ్మవారిని అడుగుతారు. ఆవిడ లోకకల్యాణం కోసమే కదా అని " సరే " అనడ...

నేడు వరాహ జయంతి - మన భూమిని రక్షించిన స్వామి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నేడు వరాహ జయంతి " బ్రహ్మగారి మనస్సునుంచి సృష్టికోసం సనకసనందనాదులు, నారదమహర్షి వంటివారు పుట్టుకొచ్చారు కాని వారు నివృత్తి మార్గంని అనుసరించడంతో మళ్ళీ సృష్టి కోసమని ప్రజాపతులు, మహర్షులు ఉద్భవించారు. వారి వలన సత్యతపోలోకాలు వంటి ఊర్ధ్వలోకాలు దేవతలు మొ.గు వారితో నిండి ఉన్నాయి. ఇక భూలోకంలో కూడా సృష్టి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మ. ఆయన ధ్యానంలో ఉండగా ఆయన నుంచి శతరూప స్వయంభు మనువులు ఉద్భవించారు. వీరు ప్రధమ మిధునం ( జంట ). వీరిని సృష్టి మొదలు పెట్టండి అంటే " ఎక్కడ " అని అడిగారు. భూమిమీద అన్నారు బ్రహ్మ. భూమి ఎక్కడుంది అని అడిగారు వారు.  భూమి లేదు అక్కడ. హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని నీటిలోపలికి వెళ్ళి పోయాడు. ఇక్కడ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుత విషయం తెలియచేసారు. హిరణ్యాక్షుడు ఒక శాస్త్రజ్ఞుడు. భూమిని ఎత్తుకు పోయాడు అంటే భూమిని తన నిర్ణీతకక్ష్యనుంచి తప్పించాడు అని తెలుసుకోవాలి అన్నారు. అది అసురలక్షణం, ప్రకృతి విరుద్ధం, సృష్టిని అడ్డుకోవడానికి చేసిన పని. భూమి రక్షణకోసం బ్రహ్మ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన నాశికలోనుంచి బ్రొటకనవ్ర...

పని చెయ్యడం వరకే, ఫలితం గురించి ఆలోచించనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కర్మణ్యేవాధికారస్తే    మా ఫలేషు కదాచన,   మా కర్మఫలహేతుర్భూః    మా తే సంగోఽస్త్వకర్మణి "                - భ.గీత 2:47 " పనిమీదే నీకు అధికారం, ఫలితంమీద కాదు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం మీద దృష్టి పెట్టకు " అన్నారు పరమాత్మ.  దీనికి ఒక కారణం అనుకున్న ఫలితం రాకపోతే బాధపడవలసి వస్తుంది అని. కాని ఇంకో అద్భుతమయిన కారణం కూడా ఉంది. ఫలితం గురించే ఆలోచిస్తూ పనిచేస్తే పనిలో శ్రద్ధ, నాణ్యత తగ్గుతుంది. ఉదా: ఓ చక్కటి ఆనకట్ట కడితే 50 వేలు లాభం వస్తుంది అనుకుందాం. శ్రద్ధగా నాణ్యతతో పనిచేస్తే ఆ లాభం ఎలాగూ వస్తుంది. కాని 50 వేలమీదనే దృష్టి పెడితే సులభంగా తొందరగా ఆ మొత్తం ఎలా పొందవచ్చో ఆలోచించడం మొదలెడతాడు. అవినీతి పెరుగుతుంది, నాణ్యత తగ్గుతుంది. ఇప్పుడు అదే జరుగుతూంది ఎక్కువగా. ఎంత అద్భుతమయిన సత్యం చెప్పారు పరమాత్మ. అదే పనిమీద, నాణ్యతమీద దృష్టి పెడితే క్రొత్త ఆలోచనలు వస్తాయి, క్రొత్త పద్దతులు తెలిసి లాభం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పని అద్భుతంగా జరగడంతో మంచిపేరు కూడా వస్తుంది చేసినాయనకు. సుందరకాండలో హనుమ ఇ...

అమ్మవారు పది రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చి మాయ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " తాం మ ఆవహ జాతవేదో    లక్ష్మీమనపగామినీం " - శ్రీసూక్తం. ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అని ప్రార్ధిస్తాం. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి. " ధనమగ్ని ర్ధనంవాయుః   ధనంసూర్యో ధనంవసుః   ధనమింద్రో బృహస్పతిః   వరుణం ధనమశ్నుతే " అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు తమతమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు తల్లీ. ఎంత అద్భుతం అమ్మవారి ఐశ్వర్యం. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.  " అశాంతస్య కుతః సుఖం " - ఎప్పుడూ " అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది ( భ.గీత 2:66 )" అన్నారు పరమాత్మ గీతలో. " భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏ...

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏  " ప్రాణాంస్త్యక్తుం సదోద్యుక్తాః,   దేశరక్షణ తత్పరాః,    రుద్రస్యాంశౌ హి యోద్ధారః,    పూజ్యా రుద్రవదేవ తే "                  - చాణక్యుడు  " దేశరక్షణ కోసం ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడే వారు అందరూ రుద్రాంశ సంభూతులు. రుద్రుడు కి ఇచ్చే గౌరవాన్నే అలాంటివారందరికీ ఇవ్వాలి " అని భావం. మనదేశ స్వాతంత్ర్యం కోసం, మనమందరం ఇలా స్వతంత్రంగా జీవించడం కోసం ప్రాణాలు అర్పించిన వారికి అందరికీ నివాళులు అర్పించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ స్వాతంత్ర్యదినోత్సవ సమయమున మన కనీస కర్తవ్యం. సర్వే జనాః సుఖినో భవంతు - సూర్య  శుభం భూయాత్

ధైర్యం అంటే వైరాగ్యం - అనుబంధం తగ్గించుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏 " అసంశయం మహాబాహో    మనో దుర్నిగ్రహం చలం   అభ్యాసేన తు కౌంతేయ    వైరాగ్యేణ చ గృహ్యతే "                  - భ.గీత 6:35 అర్జునుడు అంటాడు " మనస్సును నిగ్రహించడం అంత సులువుకాదు కదా " అని. అప్పుడు పరమాత్మ అంటారు " కష్టమే కాని అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతోనూ నిగ్రహించుకోవడం సులభమే " అని. ఇక్కడ స్వామి " వైరాగ్యేణ చ " అన్నారు. చ అంటే మరియు అంటే వైరాగ్యం కూడా అవసరం అన్నారు. ఒక స్వామిని " ధైర్యం " అంటే ఏమిటి అని అడిగితే " వైరాగ్యం " అన్నారు.  ధైర్యం అనేది మానసికం. అది వ్యాయామాలు కసరత్తులు చేస్తే వచ్చేదికాదు. వైరాగ్యం వల్లే వస్తుంది. ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ అన్నీ పరమాత్మ ప్రసాదాలే/అనుగ్రహాలే అనుకుంటే అంతా సచ్చిదానందమే. గరికిపాటివారు పూజ్యులు శ్రీమల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ ఓ అద్భుతవిషయం తెలియచేసారు. పుట్టపర్తిసంస్థానం వారు శాస్త్రిగారికి స్వర్ణపుష్పాభిషేకం చేయ సంకల్పించి ఆహ్వానం పంపారుట. ఈయన అప్పటికే ప్రవచనాలూ అవీ మానేశారు. " నేను రాలేను " అని తెలియచేసారుట. వారికి...

కోరికలు ఎప్పటికీ ఇక చాలు అనిపించవు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు " 🙏 " అధ కేన ప్రయుక్తో2యం    పాపం చరతి పూరుషః,   అనిచ్ఛన్నపి వార్ష్ణేయ    బలాదివ నియోజితః "                - భ.గీత 3:36  పరమాత్మని అర్జునుడు అడుగుతాడు " తప్పని తెలిసీ చెయ్యకూడదని తెలిసీ ఎందుకు జీవుడు తప్పుడు/పాపపు పనులు చేస్తూనే ఉంటాడు " అని. ఇది అందరికీ సాధారణంగా కలిగే సందేహమే. పరమాత్మ అంటారు " ఇది ఇప్పటిది కాదు, జన్మజన్మలనుంచి పేరుకుపోయిన సంస్కారం/వాసనలు. కామం/కోరిక కు ' చాలు ' అనేది ఉండదు. పేరుకుపోతూనే ఉంటుంది " అని.  ఈ కోరిక అనేది చాలా చెడ్డది. ఒకటి కావాలనిపిస్తుంది. దానిని స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది తనకే స్వంతం కావాలనిపిస్తుంది. ఇంకొకరికి ద్రక్కకూడదనిపిస్తుంది. తనకి ద్రక్కకపొతే కోపం/క్రోధం వస్తుంది. ఈ క్రోధం కామానికి తమ్ముడు. ఈరెండూ హృదయంలో తిష్ఠవేసుకుని కూర్చుంటాయి. అగ్నికి " అనలం " అని ఒక పేరు. " అలం " అంటే చాలు అని అర్ధం. అనలం అంటే చాలు అనేది లేనిది అని. అగ్నిలో ఎన్నివేసినా మసి అయిపోతూనే ఉంటుంది కాని " ఇంక చాలు " అని అనదు.  కోరిక కూడా అగ్ని వంటిదే. ఎన్నికోరికలు తీర...

యజ్ఞము అంటే త్యాగం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా    పురోవాచ ప్రజాపతిః,   అనేన ప్రసవిష్యధ్వమేష    వో2స్త్విష్టకామధుక్ "                - భ.గీత 3:10 " జీవులను, యజ్ఞాలను సృష్టించిన పరమాత్మ ఈ యజ్ఞాలచే సుఖాన్ని పొందండి, ఈ యజ్ఞములను ఆచరిస్తే మీకు ముక్తికి కావలసిన సర్వమునూ లభించును " అని మనకు తెలియచేసారు పరమాత్మ. ఇక్కడ " యజ్ఞము " అంటే త్యాగము అని తెలియచేస్తూంది సనాతనధర్మం. ప్రతీ జీవుడు త్యాగాన్ని చేస్తూ ఉండాలి అని తెలియచేస్తూంది సనాతనధర్మం. ఎంత అద్భుతం. అగ్నిహోత్రం, యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే దేవతలు సంతోషించి మనకు అవసరమయినవన్నీ అనుగ్రహిస్తారు అని అర్ధం. యజ్ఞం వేరు, యాగం వేరు. పంచయజ్ఞాలు చెయ్యాలి జీవుడు తరించడానికి అని చెబుతున్నాయి శాస్త్రాలు. అవి 1. బ్రహ్మయజ్ఞం - శాస్త్రాలు, పురాణాలు, స్తోత్రాలు చదవడం 2. పితృయజ్ఞం - వారికి కనీసం తర్పణాలు వదలడం 3. దైవయజ్ఞం - హోమాలు, పూజలు చెయ్యడం 4. భూతయజ్ఞం - జంతువులకు పక్షులకు సేవ 5. మనుష్యయజ్ఞం - అతిధులకు భోజనాది సదుపాయలు కలిగించడం. ఇప్పుడు యజ్ఞం అంటే ఏమిటి అన్నది స్పష్టంగా తెల...

కోరికలు తప్పు కాదు కాని కోరిక ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ధూమేనావ్రియతే వహ్నిః,    యధా దర్శో మలేనచ,    యధోల్బేనావృతో గర్భః,    తధా తేనేదమావృతం "               - భ.గీత 3:38 " పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడును " అన్నారు పరమాత్మ. ఇక్కడ కామము అంటే కోరిక. దీనికి అంతులేదు. ఒకటి తరువాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఎలాగయినా తీర్చుకోవాలనుకున్నప్పుడు కోపం ద్వేషం అహం పెరుగుతాయి. ధర్మరాజుది ఎంతటి అద్భుత వ్యక్తిత్వమో చూద్దాం. 12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ - ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు. అంతటి అమితధర్మపరుడు, అజాతశత్రువు ధర్మజుడు. రాజసూయ యాగం చేసాడు,  కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని గౌరవించుకున్నాడు, ఆ సభలోనే శిశుపాలుడిని సంహరించారు స్వామి.  అన్ని అద్భుతవిషయాలను చూసిన ఆయన " పాచికలాడుదాం రా "...

పెద్దలు ఆచరించేదే పిల్లలు ఆచరిస్తారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యద్యదాచరతి శ్రేష్ఠః    తత్తదేవేతరో జనః   స యత్ప్రమాణం కురుతే   లోకస్తదనువర్తతే "                 - భ.గీత 3:21 " మహనీయుడయిన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును " అని తెలియచేసారు పరమాత్మ. " యధా రాజా తధా ప్రజా " అని సామెత. రాజు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా మసలుతారు. రాముడు అందుకే ఆదర్శపురుషుడు అయారు. వేలసంవత్సరాలుగా పూజింపబడుతున్నారు. గురువుమాట వేదవాక్కు. వశిష్టుడు వారి కులగురువు. తిరిగివచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ఎవరు చెప్పినా రాముడు వినకపోవడంతో వశిష్టుడిని నచ్చచెప్పమంటారు. " తండ్రి మరణించాక పెద్దకుమారుడు రాజ్యాన్ని స్వీకరించి పాలనచెయ్యడం శాస్త్రసమ్మతమే కాని అధర్మం కాదు, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు " అని వశిష్టుడి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు. " అది ఋజువర్తనం కాదు, అలా నాలాంటివారు చేస్తే ప్రకృతి ( సూర్యుడు, భూమి, గాలి, నీరు వంటివి ) సహకరించదు, కరువు...

సమస్య శక్తికి మించినది అయితే అమ్మవారికి వదిలేయాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కార్పణ్యదోషోపహత స్వభావః     పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః,    యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే      శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ "                              ‌- భ.గీత 2:7 " పిరికితనం వలన ఏమి చేయాలో తెలియటంలేదు. ఏమి చేయాలో చెప్పు. నీవే శరణు " అన్నాడు అర్జునుడు పరమాత్మతో. ఇదే ఎవరయినా ఆఖరికి చేయవలసినది. సమస్యకు పరిష్కారం కోసం శాయశక్తులా కృషి చేయాలి. ఇక తనవల్లకాదు, పరిష్కారం తన శక్తికి మించినదిగా అనిపించగానే పరమాత్మను శరణు వేడాలి. పరమాత్మ గజేంద్రుడిని ద్రౌపదిని అలాగే ఆదుకున్నారు. రామాయణం సుందరకాండలో ఓ అద్భుత ఘట్టం ఉంది.  లంకంతా వెదికి సీతమ్మ జాడ తెలియకపోయేసరికి హనుమ కలవరపడి ఇలా అనుకుంటారు: " రావణుడు సీతమ్మని వేరే ఎక్కడయినా ఉంచాడా. సీతమ్మ పెనుగులాటలో పట్టు తప్పి సముద్రంలో పడి మరణించి ఉంటుందా. నేను తిరిగి వెళ్ళి సీతమ్మ కనబడలేదు అని చెబితే వెంటనే రాముడు ప్రాణాలు వదులుతారు. అప్పుడు లక్ష్మణుడు, అయ్యో ఈ మాత్రం సహాయం కూడా చేయ...

సన్యాసం అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " కర్మణైవ హి సంసిద్ధం    ఆస్థితా జనకాదయః    లోకసంగ్రహ మేవాపి    సంపస్యన్ కర్తృమర్హసి "                 - భ.గీత 3:20 " జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుటవలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్ధమై కర్మలను ఆచరించుటయే సముచితము " - అన్నారు పరమాత్మ. ఇక్కడ రెండు ముఖ్యముగా గమనించవలసిన విషయాలు ఉన్నాయి. " లోకహితార్ధమై " అన్నారు పరమాత్మ, ఏ కర్మ అయినా సమాజశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అని. తరువాత " సముచితము " అన్నారు, అంటే మంచిది అన్నారు. ఇలా చెయ్యి అనలేదు, ఇలా చేస్తే మంచిది ( తరువాత నీ ఇష్టం ) అన్నారు పరమాత్మ. ఎంత అద్భుతం మన సనాతనధర్మం. వ్యాసర్షి ఒకరోజు పక్షులజంట ముచ్చట్లు చూసి ఆశ్చర్యపోతారు. మగపక్షితెచ్చిన ఆహారాన్ని తల్లిపక్షి పిల్లల నోటికి అందిస్తూంది. పక్షుల సంసారమే ఇంత ముచ్చటగా ఉంటే మనుషుల సంసారం ఎంత అద్భుతం అని భావించి తనకుకూడా ఒక పుత్రుడు కలుగుతే బావుంటుంది అని భావిస్తారు. " శుక " జననం జరిగింది. వ్యాసర్షి శుకుడిని వివాహం చేసుకుని సంతానాన్ని ప...

స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " ప్రజహాతి యదా కామాన్    సర్వాన్ పార్ధ మనోగతాన్,    ఆత్మన్యేవాత్మనా తుష్టః    స్థితప్రజ్ఞస్తదోచ్యతే "                 - భ.గీత 2:55 పరమాత్మ " ఓ పార్ధా, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములయిన సర్వకామములను త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తినొందునో అప్పుడతను స్థితప్రజ్ఞుడు అని పిలువబడుతాడు " అని అన్నారు. ఆస్థితిలో అతనిని ఏ తాపము బాధించదు, సుఖానికి ఉప్పొంగిపోడు, దుఃఖము కలిగినా కృంగిపోడు. రాగ ద్వేష క్రోధాలకు అతీతుడయి ఉంటాడు ( భ.గీత 2:56 ). కంచిపరమాచార్యులకు 103 డిగ్రీల జ్వరం ఓరోజు. మగతగా కూర్చుని ఉన్నారు. శిష్యుడు వచ్చి వైద్యులు వస్తున్నారు అంటే ఎందుకు అన్నారు. మీకు జ్వరంగా ఉంది, చూసి మందు ఇవ్వడానికి అన్నాడు. జ్వరం ఎంతుంది అన్నారు స్వామి. 103 పైనే ఉంది అన్నాడు శిష్యుడు. సమయం ఎంతయింది అని అడిగితే 11.30 అయింది అన్నాడు శిష్యుడు. బయట ఎండ ఎలా ఉంది అన్నారు. మాడిపోతూంది అన్నాడు. అలాగా, అయితే స్నానంకి ఏర్పాటుచెయ్యి వెంటనే అన్నారు. 11.30 గంటలే అయింది అన్నాడు శిష్యుడు...

అందరూ వేదాలు చదవనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యావానర్థ ఉదపానే    సర్వతః సంప్లుతోదకే,   తావాన్సర్వేషు వేదేషు    బ్రాహ్మణస్య విజానతః "               - భ.గీత 2:46  " ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల సారాన్ని పొందినట్టే " అన్నారు పరమాత్మ. ఎంత అద్భుత ఉపమానం. భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే సమస్త జ్ఞానమూ అదే వస్తుంది అన్నారు పరమాత్మ. వేదములను నీటిబావితోనూ పరమాత్మ ఎరుకను నీటికొలనుతోనూ పోల్చారు పరమాత్మ. ఇంటి సమీపంలో చక్కటి మంచినీటి చెరువు ఉంటే మళ్ళీ ఇంట్లో బావి దేనికి?.  త్యాగయ్య అన్నమయ్య మొ.గువారి కీర్తనల సాహిత్యం చదువుతే ఆశ్చర్యం వేస్తుంది. కీర్తన సాధారణంగా కనిపిస్తుంది కాని అంతర్భావం చూస్తే ఇతిహాసాలలోని ఘట్టాలు, ఉపనిషత్తుల సారాంశం, అమ్మవారి ధ్యాననామాలు గోచరిస్తూంటాయి. వారు ఏ గురువుల వద్ద ఏ వేదాలు, ఉపనిషత్తులు చదివారో తెలియదు. త్యాగయ్య రామనామం 96 కోట్లు చేసారని తెలుస్తూంది. మరి ఆయనకు వేదాపారాయణానికి, శాస్త్రప...

" శ్రావణమాస వైశిష్ట్యం " - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " శ్రావణమాస వైశిష్ట్యం " పవిత్రమయిన శ్రావణమాసం ఈరోజు ప్రారంభమయినది. శ్రవణం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న మాసాన్ని శ్రావణమాసంగా పిలుస్తారు. శ్రావణం అంటే శుభం అని అర్ధం. ఈ మాసంలో అన్నీ శుభదినాలే అయినా అత్యంతశుభకరమైన రోజులు కొన్ని ఉన్నాయి.  శ్రావణమంగళవారాల్లో " మంగళగౌరీవ్రతం " చేసుకుంటారు పెళ్ళి అయిన స్త్రీలు. ముత్తయిదువులని ఆహ్వానించి కాళ్ళకి పసుపురాసి బొట్టుపెట్టి సెనగలు వాయినం ఇస్తారు. ఈ పసుపు వ్రాయడం ఓ అద్భుతమైన సంప్రదాయం. శ్రావణభాద్రపదాలు వర్షఋతువు, వర్షాలు పడి ఎక్కడ చూసినా నీరు ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు నీళ్ళలో ఎక్కువగా తిరగడం పాదాలు తడిసి వ్రేళ్ళమధ్య ఒరుసుకుపోవడం జరగుతుంది. పసుపు రాయడం పాదాలకు వ్రేళ్ళకు మంచిదని తెలుసుకోవాలి. రెండవ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. మహాలక్ష్మిని సౌభాగ్యం ప్రసాదించమని కోరుకుంటారు. కొబ్బరికాయను తీసుకుని దానిమీద తడిపిన వరిపిండితో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏర్పాటుచేసి ఆ మూర్తికి పూజచేసుకుంటారు కొందరు.  ఈ వరలక్మీవ్రతం అత్యంత అద్భుతమైనది. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగింది. గృహిణి ఒక్కరూ ఏ వ్రతం చేస్తే...

పిరికితనం వదిలేయాలి, ఉత్సాహం తెచ్చుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " క్లైబ్యం మాస్మగమః    పార్ధనైతత్త్వయ్యుపపద్యతే,   క్షుద్రం హృదయదౌర్బల్యం    త్యక్త్వోత్తిష్ట పరంతప "                   - భ.గీత 2:3  " ఏమి చేయాలో తెలియటంలేదు, నువ్వే దిక్కు. ఏమి చేయాలో చెప్పు " అంటాడు అర్జునుడు పరమాత్మతో. " ముందు నిరాశ ను వదిలేయ్, ఉత్సాహం తెచ్చుకో " అంటారు పరమాత్మ. ఇక్కడ స్వామి క్లైబ్యం అన్నారు. అంటే నపుంసకత్వం.  సుందరకాండలో హనుమ ఇలా అనుకుంటారు: " అనిర్వేదశ్శ్రేయోమూలం   అనిర్వేదః పరంసుఖం,   అనిర్వేదోహి సతతం   సర్వార్ధేషు ప్రవర్తకః " ఉత్సాహమే సర్వసంపదలకు, సుఖాలకు మూలం. సదా ఉత్సాహంగా ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. మొత్తం లంకంతా వెదికినా సీతమ్మ కనబడకపోవడంతో హనుమ కొంచెం కలవరబడ్డారు. అప్పుడు ఇలా అనుకుంటారు. ఉత్సహమే మనిషికి ఊపిరి. నిరుత్సాహం ఎప్పుడూ పనికిరాదు. " ఉద్యమః సాహసం ధైర్యం    బుద్ధిః శక్తిః పరాక్రమః    షడేతే యత్ర వర్తంతే    తత్ర దేవ సహాయకృత్ "            - సుభాషిత రత్నాకరం ...

ప్రభావధర్మంని అలవాటుగా చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " ధర్మిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 958 వ నామం . " ధర్మిణీ " అంటే ధర్మమే స్వభావముగా గలది. " యతో ధర్మాణి ధారయన్ " అని చెప్పింది వేదం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. అమ్మవారికి ధర్మమే స్వభావము కనుకే ఇంత లయబద్ధంగా, ఆశ్చర్యగొలిపేలా, లోపరహితంగా ఉంటుంది ప్రపంచమంతా. ధర్మపాలన లేకపోతే సృష్టి నిలవదు. " పరిత్రాణాయ సాధూనాం    వినాశాయచ దుష్కృతాం,    ధర్మ సంస్థాపనార్ధాయ    సంభవామి యుగే యుగే "                  - భ.గీత 4:8 ధర్మసంస్థాపన కోసమే మళ్ళీమళ్ళీ వస్తూంటానన్నారు పరమాత్మ. " విశ్వధర్మములన్నిటికీ ఎవరు ఆధారమో ఆయనే పరమాత్మ " అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ధర్మం మూడు రకాలుగా ఉంటుంది. మొదటిది స్వభావధర్మం. కొందరికి ఎవరూ చెప్పనక్కరలేదు. స్వతహాగానే ధర్మపాలన చేస్తూంటారు. రాముడు, ధర్మరాజు లాంటివారు ఆ కోవలోకి వస్తారు. రాముడిని ఒక రాక్షసుడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని కొనియాడాడు. అంతటి ధర్మమూర్తి. " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమం...

జన్మ ఏదయినా ధ్యాస అమ్మవారి పాదాలపై ఉంటే నష్టం లేదు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " జ్ఞానదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 643 వ నామం .  " జ్ఞానదా " అంటే జ్ఞానమును ఇచ్చునది, అజ్ఞానాన్ని నశింపచేయునది అని అర్ధం.  మోక్షమును ఇచ్చే జ్ఞానాన్ని ఇస్తుంది. జీవుని బంధించు లోకజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మోక్షం కన్నా బంధాలు పెంచే లోకజ్ఞానం నశించడమే ముఖ్యం. శంకరులు శివానందలహరి చేస్తూ ఓ అద్భుత విషయం తెలియచేసారు: " నరత్వం దేవత్వం నగవన   మృగత్వం మశకతా,    పశుత్వం కీటత్వం భవతు    విహగత్వాదిజననం,    సదా తత్పాదాబ్జస్మరణ    పరమానందలహరీ, విహారాసక్తం చేత్       హృదయమిహ కిం తేన వపుషాం " -10 " మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని.  కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడితేనే స్వామిని తమ తలపై పెట్టుకుని సేవించుకుని చరితార్ధులవుతున్నాయి. కొ...

కోరికలు గుర్రాలయితే జీవితం నరకం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 " నీరాగా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 156 వ నామం .  " నీరాగా " అంటే కోరికలు లేనిది - రాగా అంటే కోరిక. అమ్మవారికి కోరికలు ఎందుకుంటాయి. కోరిక దేనికి, ఏదయినా పొందడానికి. అమ్మవారు పొందవలసినదీ లేదు, పొందిందీ లేదు. అంతా అమ్మవారి సృష్టే కదా.  అమ్మవారికి ఎవరిమీదా ప్రత్యేక అభిమానమూ ఉండదు, ద్వేషమూ ఉండదు. అందరూ ఆవిడ బిడ్డలే. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. మంచి ఆలోచనలు చేయండి, మంచి పనులు చేయండి, మనస్సు నిర్మలంగా ఉంచుకోండి అని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని గతజన్మ వాసనలు అంత తేలిగ్గా వదలవు.  నృసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని నేను సంతుష్టుడయి ఉన్నాను, ఏదయినా కోరిక కోరుకో అంటారు. అప్పుడు ప్రహ్లాదుడు " స్వామీ మీకో విషయం చెప్పవచ్చా " అని అడిగి ఇలా అంటాడు: " ఇంద్రియాణి మనః ప్రాణ   ఆత్మ ధర్మో ధృతిః   హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం   యస్య నశ్యన్తి జన్మనా "           - భాగవతం 7:10:8 " ఓ ప్రభూ, ఒక వ్యక్తికి పుట్టుక ప్రారంభ...