సౌందర్యలహరి
🙏 "శ్రీమాత్రేనమః"🙏
ఈరోజు శంకరాచార్యులు అద్భుతమయిన " సౌందర్యలహరి " ని ప్రసాదించిన రోజు.
అంతటి అందమైన " సౌందర్యలహరి " అన్న పేరెలా కుదిరిందో ఈ శతకానికి.
దీని పారాయణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం అని పండితులు తెలియచేసారు.
జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ పారాయణ. మనిషి 3 తాపాలతో ( ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం ) బాధపడుతూ ఉంటాడు, ఆ తాపాలను పోగొడుతుంది. దీన్ని వేదాంతం అనుకుంటారు కాని ఇది శాస్త్రీయం. అనేక రోగాలను ముఖ్యంగా మానసికరోగాలను పోగొడుతుంది.
సౌందర్యలహరి అంటే అమ్మవారి వర్ణనే కదా అనుకుంటారు, కాని ప్రతీ శ్లోకంలోనూ అంతర్వాహినిగా అద్భుత మంత్రం ఉంటుంది. ప్రతీజీవిలోనూ చైతన్యం ( పరమాత్మ ) ఉంది కాని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని అంటే అంతఃకరణశుద్ధి లేక. దానిని కలిగిస్తుంది ఈ పారాయణ.
ఉపనిషత్తుల సారమే ఇది. పఠించేవారి కష్టాలని మానసికవ్యధలనీ పోగొట్టడమే కాదు సమాజంలో సమైక్యత ప్రాముఖ్యం కూడా తెలియచేస్తూంది అని తెలియచేసారు.
ఈ శతకంలో " సౌందర్యలహరి " అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే " సొగసువెల్లువ " అని తెలుసుకోవాలి.
అమ్మవారి సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతగా అంటే ఓ శ్లోకం చూద్దాం.
" శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూట
మకుటాం, వరత్రాసత్రాణ స్ఫటికఘటికా
పుస్తకకరాం, సకృన్నత్వా న త్వాం కధమివ
సతాం సన్నిదధతే, మధుక్షీర ద్రాక్ష
మధురిమ ధురీణాః ఫణితయః ".
శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి వర అభయ ముద్రలు స్ఫటికమాల పుస్తకములతో కూడిన చేతులు ( 4 చేతుల అలంకారాలు ) కలిగిన నిన్ను ( నీరూపాన్ని ) ఒక్కసారైనా ధ్యానించుకోకపోతే సజ్జనులకైనా ( నోటివెంట ) తేనె పాలు ద్రాక్షల వలె మధురముగా ఉన్న మాటలెలా ( కవిత్వం ) వస్తాయమ్మా " అని.
ఈవిడ శారదాదేవి. వీణ ఉంటే సరస్వతీ దేవి. యోగులు కళాకారులకు దైవం శారదాదేవి. లౌకిక చదువులకు సరస్వతీదేవి అని తెలుసుకోవాలి.
సజ్జనులకే, ఆవిడ అనుగ్రహం లేకపోతే, నోటివెంట మంచిమాటలు రావు. మరి మిగతావారిమాట చెప్పాలా అని ఆయన భావన.
ఈ శ్లోకం ఒకసారి చదివి అమ్మవారి రూపాన్ని తలచుకుంటే నోటివెంట మంచిమాటలే వస్తాయి, అంతా శుభమే జరుగుతుంది. సంశయం నాస్తి.
ఈ పవిత్రమయిన " సౌందర్యలహరి " ఆవిర్భవించిన రోజున అమ్మవారిని ఎల్లప్పుడూ " అందరినీ చల్లగా చూడమని " కోరుకుందాం - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment