భ.గీత 9:3
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" అశ్రద్ధధానాః పురుషా
ధర్మస్యాస్య పరంతప,
అప్రాప్య మాం నివర్తంతే
మృత్యుసంసారవర్త్మని "
- భ.గీత 9:3
పరమాత్మ " ఈ ధర్మమునందు విశ్వాసములేని పురుషులు ( అంటే మగవారు అనికాదు ) నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూపసంసారచక్రమున పరిభ్రమించు చుందురు " అన్నారు అర్జునుడితో.
ఇలా అనేసారేమిటి అనుకోనక్కరలేదు.
" ఇతితేజ్ఞానమాఖ్యాతం ...
...............తధాకురు "
- భ.గీత 18:63.
" నేను చెప్పవలసింది అంతా చెప్పేశాను, నేను చెప్పానని కాకుండా నీ బుద్ధి/బుర్ర ని ఉపయోగించి నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి " అన్నారు పరమాత్మ అన్నారు.
దేనికయినా నమ్మకం ముఖ్యం. వంట్లో బావుండలేదు. వైద్యుడిదగ్గరకు వెళ్ళాం. మందు వ్రాసిచ్చాడు. మందులషాపులో కొనుక్కుని ఇంటికి వెళ్ళివేసుకున్నాం. టాబ్లెట్టులో పారాసిటమాల్ 250 మిల్లీగ్రాములు ఉందని చూస్తాం. లేబరేటరీకి వెళ్ళి 250 ఉందో లేదో పరీక్షిస్తామా. ఎక్కడో ముంబయిలోనో లేక వేరే దేశంలోనో తయారవుతుంది అది, కాని నమ్మకంతో వేసేసుకుంటాం.
పోనీ ఆ టాబ్లెట్ నిజంగా పనిచేసిందా లేక మామూలుగానే తగ్గిపోయిందో తెలియదు. ఎందుకంటే ఓ నానుడి వింటూంటాం " జలుబు - మందులు వాడితే వారంలోనూ వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది " అని. ఇన్సులిన్ మాయ, హార్ట్ స్టెంటు మహామాయ అని చెబుతున్నారు ప్రముఖ వైద్యులు. కాని మానటంలేదుగా, మన వైద్యుడిమీద నమ్మకంతో.
మరి మన ఋషులు వేల సంవత్సరములు ఎంతో తపస్సు, సాధన చేసి " ఇలా " చేస్తే మీకు మీకుటుంబానికి సమాజానికి మంచిది, ఇలా చెయ్యకుండా ఉంటే అందరికీ మంచిది అని చిలకకు చెప్పినట్లు చెబితే ఆచరించకుండా " ఆ స్మృతి ఈ స్మృతి " అంటూ వ్యంగ్యపు భాషణలు అవసరమా.
వారేమీ కొండ/గుడిమీదనుంచి దూకమనలేదుకదా. " ఉదయాన్నే స్నానం చెయ్యి, ఓ అరగంట నీకు నచ్చిన దేవుడిముందు కూర్చుని ఇతరాలోచనలు పెట్టుకోకుండా ఏదో ఒక నామజపం చేసుకో, నీ ఆరోగ్యం బావుంటుంది " అని చెబితే దానిలో దోషమేముంది.
ఓ స్త్రీని 50 ముక్కలుగా నరికి అక్కడా అక్కడా పడేసారని చదువుతున్నాం. అమ్మాయిని 4గురు మగాళ్ళు పాడుచేసారని చదువుతున్నాం. ఎప్పుడయినా ఎక్కడయినా స్త్రీలు మగవాడిని అలా చేసినట్లు వింటున్నామా. అందుకే " నస్త్రీ స్వాతంత్ర్యమర్హసి " - " స్త్రీని వంటరిగా వదలకు "' అంది సనాతనధర్మం. దానిలో తప్పేముంది. స్త్రీని " అమ్మవారు " గా భావించి పూజించేవారు అలా ఎందుకు చెప్పారు, దానిని అనుసరిస్తే వస్తే నష్టమేమిటి అని కొద్దిగానయినా ఆలోచన చెయ్యనక్కరలేదా.
నేటి రకరకాల సమస్యలకు మూలకారణం " సనాతనధర్మం " ని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం, గౌరవించకపోవడం, ప్రక్కనపెట్టడమే అని గ్రహించాలి.
అందుకే పరమాత్మ " ధర్మాన్ని విశ్వసించనివారు ఇలా అజ్ఞానంతో బాధపడుతూనే ఉంటారు, తప్పదు " అన్నారు.
సనాతనధర్మాన్ని కాపాడుకుందాం, అనుసరించి బాగుపడదాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయత్
Comments
Post a Comment