శ్రీభాస్కరరాయల " - సౌభాగ్యభాస్కరం " - సూర్య
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం " సౌభాగ్యభాస్కరం " వ్రాసిన శ్రీభాస్కరరాయలవారు అమ్మవారి ప్రియభక్తుడు. అద్భుతమయిన విద్వత్తు. ఆయన శ్రీలలితాసహస్రనామాలకే కాక త్రిపుర, భావనోపనిషత్తులకు కూడా భాష్యం వ్రాసారు. గణేశసహస్రంకి భాష్యం వ్రాసారు. అద్భుతమైన గణేశసహస్రం శివుడు ప్రసాదించినది.
భాస్కరరాయలవారు నివసించే రాజ్యపు రాజు ఓసారి ఈయన దగ్గరకు వచ్చి " సంతానం లేదు " అని బాధపడ్డారు. ఈయన " దానిదేముంది, ఓ చక్కటి యాగం ఉంది, చేద్దాం. కొన్ని రోజులు ఇక్కడే ఉండు " అన్నారు. ఆ యాగానికి ఉదయం సాయంత్రం నదీస్నానం ముఖ్యం. అక్కడకు దగ్గరలో నది ఏదీ లేదు. భాస్కరులు " సరే సంకల్పం చేద్దాం, ఓ నదిని యాగం అయేదాకా మన గ్రామం మీదుగా ప్రవహించమని " అని సంకల్పం చేసారు. కొంచెం దూరంలో ప్రవహిస్తూన్న నది మహదానందపడిపోయింది. భాస్కరులు తనలో కొంతకాలం స్నానం చేస్తారని. వెంటనే దారి మరల్చుకుని ఆ గ్రామం మీదుగా ప్రవహించడం మొదలు పెట్టింది. నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి కాని నదులు కూడా ఎవరయినా పుణ్యాత్ములు స్నానానికి వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాయి అని చెబుతారు పండితులు. ఇప్పటికీ ఆ గ్రామంమీదుగా ఓ నది కొంతకాలం ప్రవహించి ఆగిపోయినట్లుగా తెలియచేసే ఆనవాళ్ళు ఉన్నాయిట.
సరే యాగం అయింది. కొడుకు పుడతాడు, వెళ్ళిరా అని రాజుని పంపించేసారు భాస్కరులు.
కొన్నిరోజులు పోయాక రాజు వచ్చి భాస్కరులకు సంతోషంతో తన భార్య గర్భం దాల్చిందని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు. రాజు వెడుతూంటే భాస్కరుల శిష్యుడు ఎదురుపడ్డాడు. మానవనైజం, అతనికి కూడా విషయంచెప్పి " అమ్మాయా అబ్బాయా ఎవరు పుడతారు " అని రాజు అడుగుతే శిష్యుడు " అమ్మవారు యజ్ఞరూపి కదా అమ్మాయి పుడుతుంది " అని ఎదరకు వెళ్ళిపోయాడు. రాజు " భాస్కరులు అబ్బాయి అన్నారు, శిష్యుడు అమ్మాయి అంటున్నారు, అయినా ఎవరయినా ఒకటే కదా " అనుకుని వెళ్ళిపోయాడు.
భాస్కరుల శిష్యుడు అంటే సాధారణ వ్యక్తి అవడుకదా. రాణికి నపుంసకుడు పుట్టాడు. రాజు వచ్చి భోరున ఏడుస్తూ భాస్కరుల కాళ్ళమీద పడ్డాడు. విషయం విని " ఎంతపని చేసావు, అలా ఎలా అడిగావు శిష్యుడిని " అని " సరే అయిందేదో అయింది, చక్కటి అమ్మవారి జపం చేద్దాం, చక్కటి కొడుకుగా అవుతాడు " అని జపం చేయడం, కొడుకుగా మారడం జరిగింది.
అంతటి మహిమాన్వితమయిన విద్వత్తు కనుకే శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసే అవకాశం భాస్కరులకు ప్రసాదించింది అమ్మవారు.
" యదా యదా హి ధర్మస్య.......( భ.గీత 4:7 ) " - అన్నారు పరమాత్మ. ధర్మానికి హాని జరిగే సమయాలలో శంకరులు, భాస్కరరాయలు వంటివారు జన్మతీసుకుంటూ ఉంటారు. సనాతనధర్మం గొప్పదనం, అదృష్టం అది.
పుణ్యపురుషులు, కారణజన్ములు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment