భగవద్గీత 8:15 - దుఃఖాలయం అశాశ్వతం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయ మశాశ్వతం,
నాప్నువంతి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః "
- భ.గీత 8:15
పరమాత్మ ఈ జీవితాన్ని " దుఃఖాలయం, అశాశ్వతం " అన్నారు. ఎంత అద్భుతమైన పదాలు.
రామాలయం అంటే రాముడు కొలువై ఉన్నది. శివాలయం అంటే శివుడు కొలువై ఉన్నది. మరి దుఃఖాలయం అంటే దుఃఖం కొలువై ఉన్నది అని కదా అర్ధం. ఈ జీవితం దుఃఖం తో కూడుకున్నది పైగా అశాశ్వతం. మరి ఇటువంటి జీవితం కోరుకోవడం దేనికి. పరమాత్మని నమ్ముకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం గిట్టడం ఉండదని స్వామి చెబుతున్నారు.
వివేకానందుడు భయాన్ని వదిలేయమన్నారు. భయమే దుఃఖానికి మూలం. ఆయన ఓ చక్కటి కధచెప్పారు.
వంటలన్నీ తయారు చేసి పెట్టి అక్కడివారు ప్రక్కకు వెళ్ళారు ఏదోపనిమీద. ఓ కుక్క వచ్చింది. తినదామని ఎదరికి వెళ్ళడం, ఎవరైనా వచ్చి నడ్డివిరగ్గొడతారేమో అని ఇటూఅటూ చూడడం. ఒకవేళ ఏదో కొద్దిగా తిన్నా భయంతో తిన్న తిండి దానికి సంతోషమేమి కలిగిస్తుంది.
మానవజీవితం కూడా అంతే. ఎప్పుడూ ఏదోదానిగురించి భయపడుతూ బ్రతికే జీవితం అవసరమా అన్నారు వివేకానందుడు. అందుకనే నిర్భయత్వం అలవాటుచేసుకోమన్నారు.
పరమాత్మ " అశాంతస్య కుతః సుఖం (భ.గీత 2:66)" అన్నారు. ఎప్పుడూ అశాంతితో ఉండేవారికి సుఖం ఎక్కడిది.
భోగాభిలాషను పెద్దపెద్ద కోరికలను దూరం పెడితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఆవిధంగా జీవించేలా అనుగ్రహించమని పరమాత్మను కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment