సనాతనధర్మం భవిష్యత్తు - సంస్కృతి సంస్కృతం 5 - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" సంస్కృతి - సంస్కృతం 5 "
మా గ్రామవాసి, బంధువు అయిన " పండితరాజ " జగన్నాధపండితులు తన 25వ ఏటే కాశీవిశ్వవిద్యాలయానికి ముఖ్యాధిపతి అయేరు. ఆయన 16వ ఏటకే వేదశాస్త్రాల్లో దిట్ట, ఎందరో పండితులను శాస్త్రవిజ్ఞానంతో ఓడించి ఆ పదవి చేపట్టడం జరిగింది.
ఆకాలంలో బాదుషా వారి ఆస్థానంలో ఉండే మౌల్వీలు హిందువులగురించి కొంచెం కించపరిచే విధంగా మాట్లాడేవారు. ముఖ్యంగా 2 విషయాలు బాధించేవి. ఒకటి సంస్కృతం కూడా అరబ్బీనుంచే పుట్టిందని, రెండవది హిందూ పురాణాలే చెబుతున్నాయి " పరశురాముడు 21సార్లు దండయాత్ర చేసి రాజుల్నందరినీ చంపేసాడు " అని, కనుక దేశంలో అప్పుడున్న రాజులందరూ " నకిలీలే " అనీనూ.
రాజస్తానీయ " జయపుర " పాలకుడైన మొదటి శ్రీసవాయీ జయసింహ మహారాజు ఈయన్ని కలిసి విషయం చెప్పి " చాలా బాధగా ఉంది, నేను ధనసహాయం చేస్తాను, తమరు ఆజ్మీర్ వెళ్ళి వారి భాషలు అరబ్బీ, పార్శీ, ఉర్దూలను నేర్చుకుని వారిభాషలోనే వారికి సరైన సమాధానం చెప్పి మా ఈ బాధను తొలగించాలి " అని అడగడంతో ఈయన ఆ భాషలలో పాండిత్యం సంపాదించి వచ్చి, మహారాజు పలుకుబడితో ఓ రోజు బాదుషా ( బా ) కొలువుకు వెళ్ళారు జగన్నాధపండితులు ( జగ ). బాదుషా ఈయన వాలకం చూసి కొంచెం వేళాకోళంగా మాట్లాడేడు. వారి సంభాషణ ఇలా జరిగింది:
బా: మీ యజ్ఞోపవీతం అంత
నల్లగా ఉందేమిటి
జగ: మసి అంటుకుంది
బా: మసా, ఎలా
జగ: స్నానం చెయ్యడం వలన
బా: స్నానం చేస్తే మసి
అంటుకుంటుందా?
జగ: నీళ్ళు నల్లగా ఉన్నాయి
కనుక
బా: నదిలో నీళ్ళు నల్లగా
ఉండడమేమిటి
జగ: యమునా నదిలో నీళ్ళు
నల్లగా ఉన్నాయి
బా: ఆశ్చర్యంగా ఉంది,
అర్ధమవలేదు
జగ: మీరు ఒక్కొక్క రాజ్యాన్ని
జయిస్తూ పోతూంటే
చనిపోయిన సైనికుల
భార్యలు రేయింబవళ్ళు
దుఃఖిస్తూ ఉండడం వల్ల
వారి కాటుకకన్నుల
నుండి కారిన కన్నీరు
పొంగిపొరలి వచ్చి
యమునలో కలవడంతో
దాని నీరు ( కాటుకతో )
నల్లగా అయిపోయింది.
( బాదుషా పరాక్రమాన్ని
వర్ణిస్తూన్నట్లుగా
స్త్రీలకన్నీటితో అలా
చమత్కారంగా
చెప్పారు ).
బా: " అద్భుతం, ఎంతటి
చమత్కారం ( బాదుషాకు
అలా అనిపించింది ),
మీరాకకు కారణం ".
అలా చమత్కార సంభాషణతో బాదుషాను మెప్పించి మీ మౌల్వీలతో వాదనకు వచ్చాననడం, ఆయన సరే అనడం, వీరు వాదనతో మౌల్వీలను ఓడించడం, బాదుషా కోరికపై ఆయన కొలువులో ఆస్థానపండితుడుగా చేరి " పండితరాజ " బిరుదును పొంది ముఖ్యవిద్వాంసుడు పదవిని అలంకరించడం జరిగింది. న్యాయసభకు కూడా ఈయన అధిపతిగా ఉండేవారు. బాదుషా అర్ధసింహసనాన్ని అధిష్టించడం కూడా జరిగింది.
బాదుషా కూతురు, బావమరిది కూడా ఈయన శిష్యులుగా అయినట్లు తెలుస్తూంది.
తెలుగునేలలోని ఓ కుగ్రామం నుంచి వెళ్ళి పరాయిపాలకుల సంస్థానంలో అటువంటి ఉన్నతపదవిని అధిరోహించాలంటే ఎటువంటి విద్వత్తును కలిగి ఉండాలి.
అప్పటి పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చి హిందువుల జీవితాలను కొంతవరకూ సుఖమయం చేసారని తెలుస్తూంది.
" యదా యదాహి ధర్మస్య......( భ.గీత )" - ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు పరమాత్మ రారు, ఇటువంటి వారిని పంపిస్తూ ఉంటారు.
ఎందరో మహానుభావుల కష్టఫలితం కారణంగానే నేటికీ సనాతనధర్మం నిత్యనూతనంగా శోభిల్లుతోంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
( పండితరాయల విద్వత్తు/రచనలు గురించి తొందరలో చదువుకుందాం )
Comments
Post a Comment