శివాలయాలు ఎందుకు కిటకిటలాడుతూ ఉంటాయి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
పూజ్యులు గరికిపాటివారు ప్రవచనం చేస్తూ ఓ విషయం చమత్కారంగా ( నిజం కూడా ) చెప్పారు.
ఆయనను ఓ అభిమాని " ఇన్ని దేవాయాలున్నా శివాలయాలు ఎందుకండీ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటాయి " అని అడిగాడు.
ఈయన " ఓ సారి కళ్ళుమూసుకుని మీ ఇంట్లో ఉన్న లేక ఎక్కడయినా చూసిన శివకుటుంబం ఫొటో గుర్తుచేసుకో. శివుడు చిరునవ్వుతో కూర్చుని ఉంటారు. పార్వతి ఆయనకు దగ్గరగా తగులుతూ ఇంచుమించుగా ఆవిడ శిరస్సు శివుడి భుజం మీద వాల్చినట్లుగా కూర్చుని ఉంటుంది. అటూఇటూ వినాయకుడు కుమారస్వామి దగ్గరగా కూర్చుని ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు అమ్మవారి ఒడిలో కూర్చుని కూడా ఉంటూంటారు.
వారిని అలా చూస్తే మనకు మన పెదమేనమామగారి లేక పెదనాన్నగారి కుటుంబ ఫోటో చూస్తూన్నట్లు అనిపిస్తుంది.
శివాలయానికి వెడితే మన పెదమేనమామ లేక పెదనాన్న ఇంటికి వెళ్ళినట్లు ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే శివాలయానికి ఎక్కువగా వెడుతూ ఉంటారు జనాలు " అన్నారు.
చాలా చక్కటి వివరణ అనిపించింది.
నాకు అనిపించింది. శివుడు భక్తసులభుడు. ఎవరయినా రాగానే అతడు ఎంత అవినీతి చేసాడు, ఎందరిని బాధపెట్టాడు లాంటి విషయాలు పట్టించుకోడు. ఆ విషయాలు తరువాత చూడవలసినవారు చూస్తారు. శివుడు మాత్రం " ఏమి నాయనా ఇలా వచ్చావు " అని అడిగి అతని కష్టాలన్నీ విని ఓదారుస్తాడు.
కొంచెం ప్రక్కకు వెళ్ళగానే " అవ్యాజకరుణామూర్తి " అమ్మవారు కూర్చుని ఉంటుంది చిరునవ్వుతో. దరహాసోజ్వలముఖి. ఆవిడది సత్వగుణం. కోపమే రాదు. అన్ని కష్టాలను తనకు వదిలేయమని ఓదార్చి పంపిస్తుంది. మనస్సు ప్రశాంతతను పొందుతుంది.
జీవుడికి మానసికప్రశాంతత కన్నా కావలిసినది ఏముంటుంది. అది శివాలయంలో దొరుకుతుంది. సంశయం నాస్తి.
శుభం భూయాత్
Comments
Post a Comment