మనస్సు - కోతిచేష్టలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
ఒకరోజు కంచి పరమాచార్యులవద్దకు ఓ భక్తుడు వచ్చాడు. దైవభక్తి మెండుగా ఉన్నవాడు, పరమాచార్యులంటే భక్తి గౌరవం ఉన్నవాడు.
భక్తుడు అన్నాడు " స్వామీ ఎప్పుడు కళ్ళుమూసుకుని అమ్మవారిని తలచుకున్నా ఓ ప్రముఖ ' నటి ' మొహం గుర్తుకొస్తూంది, ఏమి చెయ్యడం " అని.
స్వామి అన్నారు " మొహం ఎందుకు గుర్తుచేసుకోవడం, నువ్వు పట్టుకోవలసినవి, కోరుకోవలసినవి అమ్మవారి పాదాలు, అందుకని పాదాలు గుర్తుచేసుకో " అని.
అమ్మవారి పాదాలు అగ్నివర్ణంలో ఉంటాయి. పసుపువ్రాసి, పారాణి అలంకరించి ఉంటాయి. ఆ ఊహే అద్భుతం.
శంకరులు శివానందలహరి చేస్తూ ఇలా అంటారు :
" సదా మోహాటవ్యాం చరతి
యువతీనాం కుచగిరౌ,
నటత్యాశాశాఖా స్వటతి
ఝడితి స్వైర మఖికః,
కపాలిన్ భిక్షో మే
హృదయకపి
మత్యంత చపలం ,
ధృఢం భక్త్వా బద్ధ్వా శివ
భవదధీనం కురు విభో " .
" ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ అధీనంలో ఉంచుకో స్వామీ " అని.
ఇక సామాన్యమానవుల గురించి చెప్పాలా. అందుకే గీతలో స్వామి చక్కటి మార్గాన్ని సూచించారు. నాసికాగ్రాన్ని చూడమంటే రెండు కళ్ళతో అని కాదు. కళ్ళుమూసుకుని అంతర్దృష్టిని ఎవరి ముక్కుచివరన వారిని నిలుపమని.
అప్పుడు మనస్సు కొంచెం కుదురుకుంటుంది.
ఈరోజు శ్రీకంచిపరమాచార్యుల ఆరాధనోత్సవం. కారణజన్ములు.
" అపారకరుణా సింధుం
జ్ఞానదం శాంతరూపిణం,
శ్రీ చంద్రశేఖర గురుం
ప్రణమామి ముదావహం "
ఏతత్ సర్వం శ్రీకంచికామాక్షీదేవ్యార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment