కిరాణాకొట్టువాడు తపస్వి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

" నాహం వేదైః నతపసా 

  నదానేన నచేజ్యయా,

  శక్యా ఏవంవిధో ద్రష్టుం 

  దృష్టవాన్ అసి మాంయధా "

                - భ.గీత 11.53

గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు.

జాబాలి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన అద్భుతమయిన తపస్సు చేసేవారు. ఓ సారి ధ్యానంలో అలా ఉండిపోవడం, ఆయన తలపై పిట్టలు గూడుకట్టుకుని జీవించడం జరిగింది. ఆయన ధ్యానంలోంచి బయటకువచ్చి తలను చూసుకుని ఓహ్ " గొప్ప తపస్వి " ని అయిపోయాను అనుకున్నాడు. అప్పుడు పిట్టలు కిలా కిలా నవ్వి " కాశీలోని తులాధారుడి తపస్సు ముందు నీ తపస్సు ఎంత " అనడంతో జాబాలి ఆశ్చర్యపోయాడు.

కాశీలోని తులాధారుడి ఆశ్రమమంతా పుట్టలు పిట్టలతో నిండిపోయి ఉంటుందేమో, ఓ సారి వెళ్ళి చూడాలి అనుకుని కాశీ వెళ్ళాడు. తులాధారుడు ఎవరు అని ఒక్కొక్కరిని అడుగుతూ వెడితే చివరకు ఓ కిరాణాకొట్టుకు చేరాడు జాబాలి. కొట్లో కూర్చుని ఉన్నాయనను " తులాధారుడు " ఎవరని అడిగితే " నేనే, మిమ్మల్ని పిట్టలు పంపించాయా " అని అడగడంతో జాబాలికి మతిపోయింది. కిరాణా సరుకులు అమ్ముకునే ఇతను తపస్వి ఏమిటి అనుకున్నాడు.

అప్పుడు తులాధారుడు " నా పనిని నేను స్వధర్మం అనుకుని చేస్తాను. అవినీతి చెయ్యను. అన్యాయం చెయ్యను. ఎంతదూరమయినా వెళ్ళి నాణ్యమయిన సరుకులు తెచ్చి నాకుటుంబానికి నా చిన్న చిన్న పరోపకారాలకు సరిపోయేలా మాత్రం లాభం వేసుకుని సరకులు అమ్ముతాను. ఏపనిచేసినా భగవదార్పణం అనుకుని చేస్తాను. అందుకని నేను తపస్విని " అన్నాడు.

పరమాత్మ చెప్పినది ఇదే. పరోపకారం చెయ్యకపోయినా ఎవరికీ మనస్సులో కూడా కీడు తలపెట్టనివాడు ధన్యుడు.

పరమాత్మ చెప్పినది " కర్మలను ఎలాగూ వదలలేవు కనుక కర్మఫలాలను వదిలేయి " అని. కర్మఫలమంతా ఈశ్వరసంకల్పం అనుకోమన్నారు. అప్పుడు అంతా " సత్ చిత్ ఆనందమే " కదా.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ