ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి, అంతర్ముఖులవాలి, ముక్తి కోసం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అంతర్ముఖసమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 870వ నామం.
" అంతర్ముఖసమారాధ్యా "అంటే అంతర్ముఖులచే ఆరాధింపదగినది అని.
సమారాధన అంటే శాస్త్రయుక్తంగా ఆరాధించడం. శాస్త్రయుక్తంగా శ్రద్ధగా " రాజశ్యామలయాగం " చేస్తే చక్రవర్తిని చేస్తుంది అమ్మవారు అని చెబుతూంది వేదం. కాని నేడు అశాశ్వతమయిన చిన్న చిన్న పదవులకోసం ఆర్భాటంగా ఈ యాగం చేసేస్తున్నారు అందరూ.
ఈ విషయమే గీతలో పరమాత్మ తెలియచేసారు:
" యామిమాం పుష్పితాం
వాచం ప్రవదన్త్యవిపశ్చితః,
వేదవాదరతాః పార్థ
నాన్యదస్తీతి వాదినః "
- భ.గీత 2:42
" పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులవుతారు " అన్నారు పరమాత్మ.
కఠోపనిషత్తు ఏమి చెబుతూందంటే " అమ్మవారు బ్రొటకనవేలు ప్రమాణంలో అందరి హృదయాలలోనూ ఉంటారు " అని. ఎందుకు మనలోనే ఉండడం అంటే ఎప్పటికయినా సత్యం తెలుసుకుని లోపలికి ప్రయాణం ప్రారంభించి అంతర్ముఖులు అవుతారు అని. ఎక్కడో దూరంగా ఉంటే బద్ధకిస్తారేమోనని మనలోనే ఉండి అనుగ్రహించడానికని ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారు. అవ్యాజకరుణామూర్తి.
" ధీరులు నిరపేక్షులు
నాత్మారాములునైన
మునులు
హరిభజనము నిష్కారణమ
చేయుచుందురు
నారాయణుఁ డట్టివాఁడు
నవ్య చరిత్రా "
- పోతనభాగవతం.
ఇటువంటి అంతర్ముఖులకు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి ఉండదు. వారి ఆత్మలతో రమిస్తూ/ఆటాడుకుంటూ ఉంటారు. త్యాగయ్య 96 కోట్ల రామనామం చేసారంటే ఆయనకు వేరే ధ్యాస ఏమీ ఉండదు. ఇటువంటి వారినే అమ్మవారు అనుగ్రహిస్తారు.
అన్నమయ్య " మొదలుండ కొనలకు మోచి నీళ్ళు పోయనేల, ఎదలో నీవుండ ఇతరములేల " అంటారు.
ఒక్కసారి అంతర్ముఖులవుతే అశాశ్వతమయిన ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది, మాయ తొలగి జీవితం ఆనందదాయకమవుతుంది.
" యత్ ఫలం నాస్తి తపసా
న యోగేన సమాధినా
తత్ ఫలం లభతే
సంయక్ కలౌ కేశవ కీర్తనాత్"
మిగతా యుగాలలో తపస్సు, యోగం, సమాధితో ఏ ఫలం వస్తుందో ఆ ఫలం కలియుగంలో కేవలం కేశవనామ స్మరణతో లభిస్తుంది అని భాగవతం తెలియచేస్తూంది.
అలా స్మరణ చేయడం కూడా అంత సులభం కాకపోయినా ప్రయత్నం చేస్తూ ఉండడం మంచిదే. అమ్మవారి నామస్మరణ చేసుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment