మంచి గురువును కూడా పరమాత్మే ఏర్పాటు చేస్తారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా,
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శినః "
- భ.గీత 4:34
అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " మనస్సుని నిగ్రహించుకోవడం, జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని.
స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న గౌరవంగా ఉండాలి అని. ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదయి జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.
" గురువును పట్టుకో " అన్నారు స్వామి కాని భక్తితో కోరుకుంటే మంచి గురువును ఆయనే పంపిస్తారు.
పరీక్షిత్ మహారాజు శాపం కారణంగా 7 రోజులలో మరణిస్తానని తెలుసుకుని గంగాతీరంలో దర్భలమీద కూర్చుంటారు పరమాత్మని పొందడం ఎలాగా అని ఆలోచనచేస్తూ. వ్యాసర్షి, నారదుడు, అత్రి, వశిష్టుడు, భరద్వాజుడు మొ.గు ఋషులందరూ వేంచేసి పరీక్షిత్తు పరమపదించేవరకూ అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు. పరమాత్మని పొందాలి, ఎలా అనే ధ్యాస తప్పుతే వేరే ఆలోచనలేదు పరీక్షిత్తుకి. అదుగో ఆ సమయంలో 16 ఏళ్ళ కుర్రాడు, అవధూత అక్కడకు రావడం, భాగవత సప్తాహం చేయడం, పరీక్షిత్తు పరమాత్మ సన్నిధికి చేరడం జరిగింది. ఆ అవధూతయే గురువు శుకుడు. శుభ సంకల్పం చేసుకోవాలే కాని గురువును వెతుక్కోనక్కరలేదు, పరమాత్మే పంపుతారు తగిన గురువును.
శిష్యుడు మంచి గురువు కోసం ప్రయత్నిస్తాడు అంటారు కాని గురువు కూడా మంచి శిష్యుడు కోసం ఎదురుచూడడం, వెతకడం చేస్తారు అని చెబుతారు పండితులు.
అమ్మవారు " గురురూపిణి ".
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment