" నాకు తెలియదు " అని అన్నాడంటే అతను జ్ఞాని - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" త్రిదశేశ్వరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 629 వ నామం.
" త్రిదశేశ్వరీ " అంటే జీవుడి మూడు దశలకి/ అవస్థలకి ఈశ్వరి. మూడు అవస్థలు అంటే జాగృతి, స్వప్న, సుషుప్తి దశలు.
విష్ణుసహస్రనామాలలో " త్రిదశాధ్యక్షః " అని ఒక నామం. దానికి " జాగృతి, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు సాక్షీభూతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
మనిషికి సాధారణమైన 3 అవస్థలు ఉంటాయి - అవి 1. చైతన్య/జాగృతి 2. స్వప్న 3. సుషుప్తి.
వివరంలోకి వెడితే మనిషి పగలంతా ఏదో ఒక పనిచేస్తూ చైతన్యంతో ఉంటాడు. రాత్రి నిద్రలో రెండు అవస్థలు - 1. కలలతో కూడిన నిద్ర లేక స్వప్నం 2. కలలు లేని గాఢ నిద్ర లేక సుషుప్తి. పొద్దున్న లేస్తాడు, మళ్ళీ చైతన్యం.
ఈ కలలు లేని నిద్ర " సుషుప్తి " ఒక భాగ్యం. అందరికీ అన్నివేళలా దొరకదు. సుఖావస్థ. " నిన్న రాత్రి ఏం గాలి, ఏం వర్షం " అనగానే " అవునా, నేను నిద్రపోయాను. ఏమీ తెలియనే లేదు " అనడం సాధారణంగా వింటూంటాం. " మిన్ను విరిగి మీదపడినా లేవడు " అంటూంటారు. అమ్మవారి అనుగ్రహం.
" స్వాపనః " అని ఇంకో అద్భుతనామం ఉంది విష్ణుసహస్రంలో. దాని అర్ధం " తనమాయతో ప్రాణులను నిద్రలో ఉంచువాడు " అని. ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం అనుకోవాలి. అదేమిటండీ అనిపించవచ్చు. అజ్ఞానం ఒక వరం కొన్ని విషయాలలో.
కేనోపనిషత్తు " నాకు ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని " అని తెలియచేస్తూంది. అదేమిటీ అనిపిస్తుంది కాని అన్నీ తెలుసు అనేవాడు అజ్ఞానే కదా, అమ్మవారి విషయంలో.
నిద్ర ఒక వరం. ఆనందావస్థ. మనస్సు బాగుండకపోయినా, వయస్సు పెరిగేకొలదీ నిద్ర పట్టడం కష్టం. దానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. అటువంటి ఆనందావస్థని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
👍🙏
ReplyDelete