వేలమంది ప్రయత్నిస్తే కొందరికే భక్తి కలుగుతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" మనుష్యాణాం సహస్రేషు
కశ్చిద్యతతి సిద్ధయే,
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్త్వతః "
- భ.గీత 7:3
" వేలమంది వ్యక్తులలో, పరిపూర్ణత కోసం ఎవరూ ప్రయత్నించరు, మరియు పరిపూర్ణతను సాధించిన వారిలో, సత్యం గురించి ఎవరికీ తెలియదు " అన్నారు పరమాత్మ.
ప్రవచనాలయినా కళ్ళు హృదయం తెరిచి వినడానికి ప్రయత్నించేది వేలమందిలో ఒకరు. అలా ప్రయత్నం చేసిన వేలమందిలో ఒకరు పరిపూర్ణతను పొందుతారు అని తెలుసుకోవాలి.
స్వర్గలోకం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందంటారు ఎలా అండీ అని అడిగాడు ఒకాయన. పండితులు చెప్పినది కోట్లమందిలో ఒకడు అక్కడకు వెడతాడు నాయనా, పుణ్యం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడు. అందుకని అక్కడ ఎక్కువ మంది ఉండరు. అందుకని ఎప్పుడూ పరిశుభ్రంగా, అందంగానే ఉంటుంది అని.
మరి ప్రవచనాలు వినడం వల్ల ఉపయోగమేమయినా ఉందా అని ఎవరికయినా సందేహం కలిగినా తప్పు పట్టకూడదు. సందేహం అంటూ వస్తేనే కదా నివృత్తి/పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ప్రవచానలలో ఏమి చెబుతారు, దేవీదేవతల మహిమలు, వేదాలు పురాణాలు శాస్త్రాలలోని విషయాలేగా. అటువంటి విషయాలు వినగా వినగా అదృష్టం బాగుండి అమ్మవారు అనుగ్రహిస్తే మన మనస్సుకూడా కుదురుకోవచ్చు, మనం కూడా లోపలికి ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అంటే అటువంటి విషయాలు వినడం మొదటి మెట్టు, సత్సంకల్పం.
కొన్ని లక్షలమంది కఠినసాధన చేసి ఐఐటి పరీక్షలు వ్రాస్తే కొన్ని వందలమంది ఉత్తీర్ణులవుతున్నారు. మరి పరమాత్మ చెప్పినట్లుగా కొన్నివేలమందిలో పరిపూర్ణత పొందే ఆ ఒకరు మనం కూడా అవచ్చు సాధనతో.
సాధనకోసం అవసరమయిన సంకల్పాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ పరమాత్మని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment