దేవుని మీద భక్తి కలగడం అంత సులభం కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
" నాహం వేదైః నతపసా
నదానేన నచేజ్యయా,
శక్యా ఏవంవిధో ద్రష్టుం
దృష్టవాన్ అసి మాంయధా "
- భ.గీత 11.53
గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు.
మరి ఇంతకీ " భక్తి " అంటే ఏమిటి.
" శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం,
అర్చనం వందనం దాస్యం
సఖ్యం ఆత్మ నివేదనం "
- భాగవతం
వ్యాసర్షి భక్తిగురించి చెబుతూ వీటిలో ఏది చేసినా ఉత్తమమే అన్నారు. ప్రవచనాలు వినగా వినగా భక్తి కొంచమైనా అంటుకుంటుంది. నాస్తి సంశయం.
ఉపనిషత్తులు ఏమిచెబుతున్నాయంటే :
" భక్తిమార్గేపి భవతరణార్ధే
ఏకాదశభూమికాః ప్రతిపాదితాః "
- జీవుడు తరించడానికి భక్తిమార్గంలో 11 భూమికలు ఉంటాయని తెలియచేసాయి.
ఆ భూమికలు ఏమిటో తెలుసుకుందాం.
1. మహాత్ములను సేవించడం
2. సత్పురుషులదయకు పాత్రులవడం
3. సత్పురుషులు చెప్పిన ధర్మములందు
శ్రద్ధ కలిగియుండడం
4. భగవంతుడి గుణములను శ్రద్ధగా
వినడం
5. దేవుడిపై ఆయన గుణములపై ఆసక్తి
ఏర్పడాలి
6. భగవత్స్వరూపాన్ని సంపూర్ణంగా
తెలుసుకోవాలి
7. దేవుడిపై ప్రేమవృద్ధి చేసుకోవాలి
8. దేవుడిని ఆశ్రయించడంవలన కలిగే ప్రయోజనం తెలుసుకోవడం
9. భగవద్ధర్మములు తెలుసుకోవాలి
10. దేవుడి ప్రీతికోసం పూజలు జపాలు
దానాలు చేయడం
11. అవసరమైన వారికి తగు సహాయం చెయ్యడం
భక్తి కలగడం అంత సులువు కాదు. మహాభారతంలో పరమాత్మ అంటారు:
"కోటిజన్మార్జితైః పుణ్యైః భవేర్భక్తి ప్రజాయతే"
అంటే " - కోటిజన్మలు పుణ్యం చేస్తేనేకాని భగవంతుడిపై భక్తి కలుగదు " అని.
భక్తి కలగాలంటే/సాధ్యపడాలంటే ముందు మనస్సు నిర్మలంగా ఉండాలి. అందుకని పరమాత్మని :
" తన్మే మనః శివ సంకల్పమస్తు " - సంకల్పసూక్తం - అంటే " ఎప్పుడూ మా మనసుల్లో మంచి సంకల్పాలు/ఆలోచనలు కలిగేలా అనుగ్రహించు స్వామీ " అని ప్రార్ధించాలి.
మన మనసుల్లో ఎల్లప్పుడూ మంచి సంకల్పాలనే కలిగించమని అందరం పరమాత్మని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment