అందరూ వేదాలు చదవనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యావానర్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే,
తావాన్సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః "
- భ.గీత 2:46
" ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల సారాన్ని పొందినట్టే " అన్నారు పరమాత్మ.
ఎంత అద్భుత ఉపమానం. భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే సమస్త జ్ఞానమూ అదే వస్తుంది అన్నారు పరమాత్మ. వేదములను నీటిబావితోనూ పరమాత్మ ఎరుకను నీటికొలనుతోనూ పోల్చారు పరమాత్మ. ఇంటి సమీపంలో చక్కటి మంచినీటి చెరువు ఉంటే మళ్ళీ ఇంట్లో బావి దేనికి?.
త్యాగయ్య అన్నమయ్య మొ.గువారి కీర్తనల సాహిత్యం చదువుతే ఆశ్చర్యం వేస్తుంది. కీర్తన సాధారణంగా కనిపిస్తుంది కాని అంతర్భావం చూస్తే ఇతిహాసాలలోని ఘట్టాలు, ఉపనిషత్తుల సారాంశం, అమ్మవారి ధ్యాననామాలు గోచరిస్తూంటాయి. వారు ఏ గురువుల వద్ద ఏ వేదాలు, ఉపనిషత్తులు చదివారో తెలియదు. త్యాగయ్య రామనామం 96 కోట్లు చేసారని తెలుస్తూంది. మరి ఆయనకు వేదాపారాయణానికి, శాస్త్రపఠనానికి సమయం ఎక్కడ?.
పరమాత్మ తెలియచేసినట్లుగా పరమాత్మయందు అచంచల భక్తి, విశ్వాసం ఉంటే సమస్త జ్ఞానమూ అదే వస్తుంది. అటువంటివారి వాక్కే వేదపారాయణలా ఉంటుంది.
అమ్మవారు " వాగ్వాదిని " గా అనుగ్రహిస్తుంది.
వేదాలకన్నా పరమాత్మ సన్నిధి గొప్పది. అందుకే భక్తరామదాసు " తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకూ " అన్నారు, చరితార్ధులయారు.
అందుకని మనం మన శక్తికి మించిన పారాయణలు, పుస్తకపఠనాలు చేయనక్కరలేదు. చేసి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని పాడుచేసుకోనక్కరలేదు. ఏదో ఒక చక్కటి నామజపం చేసుకుంటే చాలు.
" యజ్ఞనాం జపయజ్ఞో2స్మి " ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete