కలికాలంలో భగవన్నామస్మరణ చాలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" కలికల్మషనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 555 వ నామం .
" కలికల్మషనాశినీ " అంటే కలికాలమందలి పాపములను పోగొట్టునది అని అర్ధం.
" కల్యంతే కలహం కుర్వన్ యశ్మిన్ కలిః " - " కలికాలం ఎప్పుడూ కలహాలతో గడుస్తూ ఉంటుంది " అని భావం. కలహాలు దేనికి?. ద్వేషం అసూయ జీవులలో పెరిగిపోవడం వలన.
ఈ కలి కలియుగంలోనే ఉంటారు అనుకోకూడదు. ధర్మంతో నిండి ఉన్న సత్యయుగంలో కూడా ఉన్నాడు. నలదమయంతుల కధ మనం చదివేయున్నాం. త్రేతాయుగంలో రావణకుంభకర్ణులు, ద్వాపరంలో దుర్యోధనాదులు కలిపురుషులే. ఇప్పటి కలియుగంలో కూడా ధర్మపరులు ఉంటారు.
వ్యాసర్షి మహాభాగవతంలో ఇలా అన్నారు:
" యత్ఫలం నాస్తి తపసా
న యోగేన సమాధినా
తత్ఫలం లభతే సంయక్
కలౌ కేశవకీర్తనాత్ "
ఇతర యుగాలలో తపస్సు యోగం సమాధితో ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో కేవలం కేశవనామ కీర్తనతోనే లభించేస్తుంది.
" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ గీతలో. అంటే కలియుగంలో భగవన్నామ స్మరణ చాలు తరించడానికి.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఈ కలిప్రభావ లక్షణాలు మనమీద పడకుండా అనుగ్రహిస్తారు అమ్మవారు.
అమ్మవారి నామజపం చేసుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment