తనను నమ్ముకున్న భక్తులను అమ్మవారు వదిలేయరు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సమస్తభక్తసుఖదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 502 వ నామం
" సమస్తభక్తసుఖదా " అంటే భక్తులందరికీ సుఖములను ఇచ్చునది అని అర్ధం.
తనను నమ్ముకున్న భక్తులకు సుఖాన్ని, కీర్తిని, ముక్తిని ప్రసాదించకుండా ఎలా ఉంటారు అమ్మవారు.
ఆదిశంకరులు దేవీ అపరాధ క్షమాస్తోత్రం చేస్తూ అమ్మవారిని ఇలా ప్రార్థిస్తారు:
" న మోక్షస్యాకాంక్షా న చ
విభవ వాంఛా2పి చ న మే
న విజ్ఞానా2పేక్షా శశిముఖి
సుఖేచ్చా2పి న పునః,
అతస్త్వాం సంయాచే జనని
జననం యాతు మమవై
మృడానీ రుద్రాణీ
శివ శివ భవానీతి జపతః "
" నాకు మోక్షం వద్దు. వైభవంమీద కోరిక లేదు. విజ్ఞానం మీద ఆపేక్ష లేదు. తల్లీ నాకు సుఖపడదామన్న కోరిక కూడా లేదు. నేనేమి కోరుకుంటున్నానో తెలుసా?. నా జన్మ అంతా నీ జపంతో జరిగిపోతే చాలు " అని వేడుకున్నారు శంకరులు.
అటువంటి నిష్కామభక్తులు అవడం వలననే శంకరులు సనాతనధర్మ పరిరక్షకులుగా, కారణజన్ములుగా నేటికీ పూజింపబడుతున్నారు.
కుంతి పాండవుల పరిస్థితి చూసి బాధపడుతూంటే పరమాత్మ " అత్తా, కాలప్రభావాన్ని ఎవరూ తప్పించుకోలేరు, నన్ను నమ్ము, మీకూ మంచిరోజులు వస్తాయి, పాండవులూ రాజ్యాలేలుతారు " అనడంతో కుంతి మహదానందపడుతుంది.
" అనన్యాశ్చింతయంతో మాం......భ.గీత 9:22 " - అన్నారు పరమాత్మ గీతలో అందుకే.
తనను నమ్ముకున్న భక్తులను వదిలేయదు అమ్మవారు. సందేహం అక్కరలేదు.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మన బాగోగులు అన్నీ అమ్మవారే చూసుకుంటారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment