మరుపు మనిషికి అమ్మవారి వరం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" తిరోధానకరీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 270 వ నామం .
" తిరోధానకరీ " అంటే కనిపించకుండునట్లు చేయునది అని అర్ధం.
ఇదొక అద్భుత నామం. మరుపు ఒక అదృష్టం మనిషికి. దానిని అమ్మవారు అనుగ్రహిస్తారు.
ఈ నామానికి ఓ అద్భుతమయిన ఉదాహరణ తెలియచేసారు విజ్ఞులు. దేవుడి దగ్గర దీపం పెడతాం. కొంత సేపు అయిన తరువాత దీపం, వత్తీ రెండూ ఉండవు. అన్నీ నశించిపోతాయి. మన సమస్యలన్నింటినీ అమ్మవారి ముందు పెట్టేస్తే దీపం, వత్తిలాగ కనుమరుగవుతాయి.
కష్టాలయినా సుఖాలయినా శాశ్వతం కావు. కాని మనిషి సంతోషం కలిగించిన విషయాలను తొందరగా మర్చిపోతాడు, కష్టాలను కలిగించిన విషయాలను మాత్రం తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.
సీతమ్మ త్రిజటతో అంటారు " సంతోషాలు చిన్న చిన్న సెలయేరులు, కొండలు లాగ చిన్నవిగా అనిపిస్తాయి. కష్టాలయితే మహాసముద్రాలలాగ, పెద్ద పెద్ద పర్వతాలలాగ పెద్దవిగా కనిపిస్తాయి " అని.
అమ్మవారు మనుషుల జీవితాలలో అప్పుడప్పుడు సంఘర్షణలు, వింత సంఘటనలు కలుగచేస్తూ ఉంటారు. వాటివల్ల ఈ మానవ సంబంధాలు శాశ్వతం కావు, అనవసరంగా బంధాలు పెంచుకుంటున్నామేమో అనే ఆలోచన కలిగేలా చేస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి చనిపోయినా బాధ ఓ రెండురోజులే. తరువాత దినవారీ కార్యక్రమాలలో మునిగిపోతారు. లేకపోతే జీవితంమీద విరక్తి పుట్టి సంసారచక్రం ముందుకు సాగదు.
మానవమనుగడకు మరుపు అమ్మవారి అద్భుత కానుక. కష్టసుఖాలు రెండింటినీ కనబడకుండా, ఎక్కువ కాలం ఉండకుండా చేస్తారు. అప్పుడు కాని మనస్సు ప్రశాంతంగా ఉండదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
జీవితసత్యం బాగా చెప్పారు
ReplyDelete