సుఖపడడం కూడా అలవాటు చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" దుఃసహప్రేష్ఠవిరహతీ
వ్రతాపధుతాశుభాః,
ధ్యానప్రాప్తాచ్యుతా
శ్లేషనిర్వృత్యా క్షీణమంగలాః "
- 10:29:10
" ( గోపికలకు ) విరహతాపంవలన అశుభాలు తొలగిపోయాయి. ధ్యానంలో కూర్చుని కృష్ణుని దివ్యమంగళ విగ్రహాన్ని కౌగలించుకోగానే పుణ్యాలు కూడా నశించాయి " అన్నారు వ్యాసర్షి భాగవతంలో.
పుణ్యాలు నశించడం అన్నది ఆశ్చర్యకరమయిన విషయం కదా.
భగవానుడు ( తనవారు పరాయివారు అనే భేదం లేనివారు ) అయినప్పటికీ కృష్ణుడు గోపికలను అనుగ్రహించాలని నిశ్చయించుకున్నారు. ఓ శరత్కాలపురాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కురిపిస్తూన్నప్పుడు శ్రీకృష్ణుడు ఓ కల్పవృక్షం వద్ద నిలుచుని వేణుగానం చేస్తున్నారు.
గోపికలు ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టేసి వేణుగానం వినిపిస్తూన్న వైపుకు పరిగెత్తారు. కొందరిని వారి భర్తలు, బంధువులు ఆపేసారు. అలా ఆపేయబడినవారు అయ్యో అని బాధపడలేదు. ఉన్నచోటే మఠం వేసుకుని కూర్చుండిపోయారు. విరహతాపం వలన వారి పాపాలన్నీ నశించాయి. కూర్చున్నచోటే ధ్యానంలో మునిగిపోయి కృష్ణపరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని కౌగలించుకున్నారు ఆర్తితో. దాంతో వారి పుణ్యాలన్నీ కూడా నశించాయి.
కొద్దిగా పుణ్యం మిగిలినా సుఖపడడానికి మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. పాపపుణ్యాలు రెండూ నశిస్తేనే ముక్తి. వారి పుణ్యాలు కూడా నశించడంతో గోపికలు ముక్తిని అంటే జన్మరాహిత్యం పొందడానికి పరమాత్మ అనుగ్రహం పొందారు అని గ్రహించాలి.
కృష్ణోపనిషద్ " మోక్షం/ముక్తి/జన్మరాహిత్యం పొందే సమయం ఆసన్నమయినప్పుడు వేణుగానం వినబడుతుంది జీవుడికి " అని తెలియచేస్తూ ఉంది.
" ప్రారబ్ధం భోగతో నశ్యేత్ - పుణ్యమైనా పాపమైనా అనుభవిస్తేనే నశిస్తుంది " . కష్టాలతో బాటు సుఖాలు కూడా అనుభవిస్తూ ఉండాలి, జన్మరాహిత్యం పొందడానికి.
ఈరోజు పవిత్రమయిన ఏకాదశి.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment