ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదవుతుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా,
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానినస్తత్త్వదర్శినః "
- భ.గీత 4:34
అర్జునుడు అడుగుతాడు పరమాత్మని " మనస్సుని నిగ్రహించుకోవడం, జ్ఞానం పొందడం అంత సులభమా " అని. అప్పుడు పరమాత్మ అంటారు: " మంచి గురువును పట్టుకో, శ్రద్ధగా సేవచేసుకో, మంచి ప్రశ్నలు వేసి మంచి జ్ఞానం పెంచుకో " అని.
స్వామి " పరిప్రశ్నేన " అన్నారు. అంటే ప్రశ్న గౌరవంగా ఉండాలి అని. ప్రశ్న మంచిదయితే జవాబు మంచిదయి జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. శిష్యుడు శ్రద్ధగా గురువును సేవించి విద్యను నేర్చుకుంటే శిష్యుడివల్ల కూడా గురువుకు మంచిపేరు వస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు మొ.గు వారు అలా గురువుల గౌరవాన్ని పెంచారు.
పరమాత్మ మంచి గురువును పట్టుకో అన్నారు కాని నిజంగా గురువు కూడా ఒకమంచి శిష్యుడు దొరికితే బాగుండునని ఎదురు చూస్తారుట.
గురువు అంటే చీకటి/అజ్ఞానం లోంచి వెలుగు/జ్ఞానం లోకి నడిపించేవారు. గురువు వేసే పునాదిమీదే విద్యార్ధి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పునాది బావున్నప్పుడే భవనం/కట్టడం బలంగా ఉంటుంది. అప్పుడే పిల్లలు బాధ్యతగల పౌరులుగా అవుతారు, సమాజానికి దేశానికి మంచి జరుగుతుంది.
ఏ గురువు కూడా ఈ విద్యార్థికి చదువు చెబితే భవిష్యత్తులో తనకు ఉపయోగపడతాడని అనుకోవడం చూడలేదు, వినలేదు. అదీ గురువు నిస్వార్థసేవ.
అందుకే గురువు/ఆచార్యునికి అంత గౌరవం ఇచ్చింది మన సనాతనధర్మం.
" మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే,
తతః కిం తతః కిం తతః కిం తతః కిం "
గురువును గౌరవించుకుందాం, జీవితాన్ని సుఖమయం చేసుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment