కృష్ణుడు కోటి మన్మధుల పెట్టు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" తాసామావిరభూచ్ఛౌరిః
స్మయమానముఖామ్బుజః,
పీతాంబరధరః స్రగ్వీ
సాక్షాన్మన్మథమన్మథః "
- భాగవతం 10:32:2
రాసలీలకు ముందు గోపికలు అర్ధరాత్రి అంతర్ధానమయిన కృష్ణుడిని వెతుకుతూ ఉంటే వారిమధ్యన " మన్మధుడికే మన్మధుడయిన కృష్ణుడు ప్రత్యక్షమయారు " అని భావం.
శ్రీధరాచార్యులు ఈ శ్లోకంలోని " మన్మధమన్మధః - మన్మధుడికే మన్మధుడు " కి భాష్యం వ్రాస్తూ ఇలా అంటారు:
" బ్రహ్మాది జయ సంరూఢ
దర్ప కందర్ప దర్పః
జయతి శ్రీపతి గోపీ
రాసమండల మండలః "
" బ్రహ్మాది దేవతలను జయించాననే గర్వము కలిగిన మన్మధుడి గర్వమును అణిచిన గోపీరాసమండలాధీశుడు అయిన కృష్ణుడు ప్రకాశిస్తున్నాడు " అని.
దీనికి ఓ అద్భుతమయిన ఘట్టం చెప్పారు:
కృష్ణుడికి రాసలీల ప్రారంభసమయంలో మన్మధుడు కనిపించాడు. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని కృష్ణుడు అడిగితే మన్మధుడు " బ్రహ్మాది దేవతలను, ఇంద్రుడిని కూడా జయించేసాను. మిమ్మల్ని కూడా జయించేస్తే నాకు తిరుగులేదు కదా " అంటాడు. శివుడిని జయించలేదుకదా నువ్వు అంటే అప్పుడు ఆయన తపస్సులో ఉండడంవల్ల కుదరలేదు అంటాడు. రాముడిని కూడా ముట్టుకోలేకపోయావు కదా అంటే ఆయన ఏకపత్నీవ్రతుడు కదా అంటాడు. మరి ఇప్పుడు " ఈ ధైర్యం, ఆలోచనా ఎలా వచ్చింది నీకు " అని అడిగితే " గోపస్త్రీ పరివేష్టితో - మీ చుట్టూ గోపికలు ఉన్నారు కదా " అందుకని అంటాడు. సరే ప్రయత్నం చేసుకో అంటారు కృష్ణుడు.
చెట్టు చాటున నుంచుని రాసలీల మొదలవగానే కృష్ణుడి మీద బాణం వేద్దామని చూస్తే స్త్రీపురుషులు ఇద్దరూ ఉన్నారు అక్కడ. ఎవరిమీద వెయ్యాలి బాణాలు అని చూస్తూంటే ఓ పెద్ద కాంతిపుంజం కనిపించింది. అందులో పాశం, అంకుశం, చెరుకుగడవిల్లు, పుష్పబాణాలు ధరించిన అమ్మవారు లలితాదేవి కనిపించారు. చుట్టూ అనంగసేన, అనంగమాలిని, మదయంతి, బాల మొ.గు అమ్మవార్లు కూడా కనిపించడంతో మన్మధుడికి మతిపోయింది. విల్లు బాణాలను క్రింద పడవేసి అమ్మవారి పాదాలపై పడిపోయాడు. ఆ అమ్మవారు రాధాదేవి, రాసమండల నాయిక. అక్కడ మన్మధుడికి ఏమి పని?.
అలా మన్మధుడి గర్వం అణిచారు కృష్ణుడు అని తెలియచేసారు.
పవిత్ర కార్తీకమాసంలో రాధాదేవిని స్మరిద్దాం, తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment