అమ్మవారికి కాదు, మనకే త్రిగుణాలు ఉండేది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గుణాతీతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 961 వ నామం .
" గుణాతీతా " అంటే త్రిగుణాలకు అతీతురాలు అని. అమ్మవారు మాయాప్రకృతి. అమ్మవారి మాయ కారణంగానే త్రిగుణాలు కలుగుతున్నాయి కదా. మరి ఆవిడకు కూడా ఈ గుణాలు ఉండాలి కదా.
ఈ సందేహానికి రామకృష్ణ పరమహంస చక్కటి వివరణ ఇచ్చారు. నాగుపాము విషానికి మనిషి మరణిస్తాడు. కాని ఆ విషం నాగుపామును ఏమీ చేయదు కదా. అమ్మవారి మాయ అటువంటిదే.
గీతలో పరమాత్మ ఇలా తెలియచేసారు:
" మానపమానయోస్తుల్య
స్తుల్యోమిత్రారిపక్షయోఃl*
సర్వారమ్భపరిత్యాగీ
గుణాతీతస్సఉచ్యతే "
- భ.గీత 14:25
" సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు " అన్నారు పరమాత్మ.
కంచి పరమాచార్యుల వంటివారే ఇలా త్రిగుణాలకు అతీతులుగా ఉన్నారంటే ఇక అమ్మవారి గురించి చెప్పేదేముంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment