అమ్మవారు జ్ఞానులచే పూజింపబడుతారు - జ్ఞాని ఎవరు?- చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బుధార్చితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 825 వ నామం.
" బుధార్చితా " అంటే జ్ఞానులచే పూజింపబడునది అని భాష్యం చెప్పారు.
జ్ఞాని అంటే ఎవరు?.
కఠోపనిషత్తు ఇలా తెలియచేస్తూంది:
" ఆత్మానం రథినం విద్ధి,
శరీరం రథమేవ తు బుద్ధిం
తు సారథిం విద్ధి మనః
ప్రగ్రహమేవ చఇన్ద్రియాణి
హయానాహుర్విష
యాంస్తేషు గోచరాన్
ఆత్మేన్ద్రియమనో యుక్తమ్
భోక్తేత్యాహుర్మనీశిణః "
-1:3:3,4
" ఆత్మ రథికుడని తెలుసుకో. శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి. ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు " అని.
గుర్రానికి తిన్నగా వెళ్ళడం కోసం కళ్ళకు ప్రక్కన గంతలు కడతారు. అప్పుడు అది ప్రక్కలకు చూడలేదు.
శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ( గంతల) ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని - అంటే ఆ విధంగా జాగ్రత్త పడినప్పుడే ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు మరలించడం సాధ్యం అని ఈ ఉపనిషత్తు చెబుతోంది. అంతర్ముఖం దేనికి?
" అంగుష్ఠమాత్రః పురుషో
మధ్య ఆత్మని తిష్ఠతి "
- కఠోపనిషత్తు 2:1:12
మన హృదయంలోనే బ్రొటకనవ్రేలు పరిమాణంలో అమ్మవారు ఉంటారు అని తెలియచేస్తూంది కఠోపనిషత్తు. అమ్మవారిని తెలుసుకోవాలంటే లోపలికి ప్రయాణం చేయాలి.
లోపలికి ప్రయాణించాలంటే బయట విషయాల మీద ఆసక్తిని తగ్గించాలి. దానికని ఇంద్రియములకు ( మానసిక ) గంతలు కట్టుకోవాలి.
ఇలా చేసేవారిని జ్ఞానులు అంటారు. వారికి అమ్మవారి స్మరణ, పూజ తప్ప వేరే ధ్యాస ఉండదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment