శరీరం క్షేత్రం అని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 343 వ నామం .
" క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ " అంటే శరీరమును, శివుని పాలించునది అని భాష్యం చెప్పారు. " శరీరముచే కార్యములు చేయించువాడు క్షేత్రజ్ఞుడు " అని తెలియచేస్తూంది మనుస్మృతి.
ఈ భాష్యంలో అద్భుత విషయం ఉంది. క్షేత్రం అంటే శరీరం అని తెలిసినదే. క్షేత్రజ్ఞుడిని శివుడు అని భాష్యం చెప్పారు. ప్రతీ జీవిలోనూ ఉన్నది శివ చైతన్యమే కదా. అహం బ్రహ్మాస్మి అంటే ఇదే. అద్వైత భావన.
శరీరం కర్మక్షేత్రం. కర్మలు చేయడమే దాని పని. చేయించేది నేను అనే క్షేత్రజ్ఞుడు. శరీరం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. శైశవంలోంచి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లోకి మారుతారు కాని నేను అనే భావన ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఈ శరీరమే నేను అనే భావనలోనే గడిచిపోతుంది జీవితం. నేను వేరు, ఈ శరీరం వేరు అనే భావన సాధనతోనే లభిస్తుంది.
పరమాత్మ ఇదే విషయాన్ని గీతలో ఇలా తెలియచేసారు:
" ఇదం శరీరం కౌంతేయ
క్షేత్రమిత్యభిధీయతే,
ఏతద్యో వేత్తి తం ప్రాహుః
క్షేత్రజ్ఞ ఇతి తద్విదః "
- భ.గీత 13:2
" ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది " అని తెలియచేసారు పరమాత్మ.
ఋషులచే చెప్పబడింది అన్నారు పరమాత్మ. ఎంత అద్భుత వాజ్మయం మనది.
క్షేత్రంని క్షేత్రజ్ఞుడిని నడిపించేది/పాలించేది అమ్మవారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment