ప్రయత్నం అంటూ మొదలుపెడితే మిగతాది అమ్మవారే చూసుకుంటారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" ఛందస్సారా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 844 వ నామం.
" సారం " అంటే తాత్పర్యం, ఉద్దేశ్యం, బలం అని అర్ధం.
ఛందోబద్ధం కనుక వేదం పేరు ఛందస్సు. ఛందస్సు/వేదం యొక్క సారమే అమ్మవారు, గాయత్రి. అందుకే " గాయత్రీం ఛందసాం మాతా " అని ప్రార్ధిస్తాం.
శృతులు స్మృతులు పురాణాలు ఆగమశాస్త్రాలు అన్నీ అమ్మవారి స్వరూపాలే. రసాయనకం, భౌతికం, గణితం అన్నింటినీ " శాస్త్రం " అంటాం. అన్నీ అమ్మవారే, అందుకే ఓ క్రమపద్ధతిలో ఉంటాయి ఛందస్సులా. ఇలాంటి శాస్త్రాలన్నీ వేదంలో ఉన్నా వేదపారాయణ గమ్యం మాత్రం అమ్మవారే.
" మననాత్ త్రాయతే ఇతి మంత్రః " - ఏ మంత్రం జపం చేసినా రక్షణ దొరుకుతుంది. కాని అది అంత సులభంకాదు. ఓ వెయ్యి గాయత్రి చేద్దామని కూర్చుంటే పదిసార్లు చేసేటప్పటికే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పరవాలేదు మళ్ళీ మనస్సును లాక్కొచ్చి కూర్చోపెట్టడమే. మనస్సు ఎక్కడెక్కడికో పోతూన్నా మంత్రం లోపల తిరుగుతూ ఉంటుంది కనుక ఫలితం తప్పకుండా ఉంటుంది.
పరమాత్మ " అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే ( భ.గీత 6:35 ) " - " వైరాగ్యంతో కూడిన అభ్యాసంతో మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు " అన్నారు.
పూజ్యులు విశ్వనాధ సత్యనారాయణగారు అంటారు " పాదరసాన్ని అయినా స్థిరంగా ఉంచవచ్చుకాని, మనస్సును స్థిరంగా ఉంచడం కష్టం " అని.
" మూల గాయత్రి " అందరూ చెయ్యకూడదు. అది ఉపనయనం సమయంలో తండ్రి కొడుకుకు గురుముఖంగా రహస్యంగా ఉపదేశిస్తాడు, కన్నతల్లికి కూడా వినబడకుండా. మరి ఇతరులు, స్త్రీలు ఎలా చదువుతారు మూలగాయత్రిని. ఎన్నో ఇతర మంత్రాలు ఉన్నాయి, ఎవరయినా జపం చేసుకోవడానికి.
ప్రయత్నం అంటూ మొదలుపెడితే మిగతాది అమ్మవారే చూసుకుంటుంది. కిం సంశయం?.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment