శాంతమే కాదు కోపం కూడా అవసరమే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
వేదమాతని " ధియోయోనః ప్రచోదయాత్ " అని ప్రార్ధిస్తాం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా అనేకాదు, అవసరమయినప్పుడు తగిన పౌరుషాన్ని కోపాన్ని కూడా ప్రసాదించు తల్లీ అని అర్ధం.
రామలక్ష్మణులు వానరవీరులతో లంకను చేరడానికి బయలుదేరి సముద్రపు ఒడ్డుకు చేరారు. సముద్రాన్ని ఎలా దాటి లంకను చేరాలన్నది సమస్య. సముద్రుడు కరుణించాలిగా.
రాముడు దీక్ష తీసుకుని ఉపవాసంతో దర్భలమీద పడుకుని మూడు రోజులు ఎదురు చూసారు సముద్రుడు కరుణించి మార్గం చూపుతాడని. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. లేచి కోపంతో కోదండం తీసుకుని ఎక్కుపెట్టగానే సముద్రుడు ఎదురుగా వచ్చి సేతు కట్టమని సలహా ఇచ్చారు.
ఈ పని రాముడు ముందే చేయవచ్చుగా, మూడు రోజులు కలిసివచ్చేది అనిపించవచ్చు. తప్పు. అదే సనాతనధర్మం గొప్పదనం. ప్రకృతిని గౌరవించాలి. అరివీరభయంకరుడయినా రాముడు తొందరపడలేదు.
మరి రాముడు గురించి ఆయన పరాక్రమం గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి మూడు రోజుల దాకా సముద్రుడు ఎందుకు ఎదరకు రాలేదు. రాడు, రాకూడదు. రాముడు వెడుతూన్నది లోకకంటకుడయిన రావణుడిని చంపడానికి. మరి రాముడు ఎంత కోపం, పౌరుషంతో రగిలిపోతూ ఉండాలి. బుద్ధిమంతుడిలా దర్భలమీద పడుకుని దీక్షతో శాంతంగా ఉంటే ఎలా?. కోపంతో లేచి కోదండం ఎక్కుపెట్టగానే సముద్రుడు ఎదరకు వచ్చేసరికి వానరవీరులకు, సైన్యానికి ఒళ్ళు జలదరించింది, తమ రాముడి పరాక్రమాన్ని గ్రహించడం జరిగింది.
కర్ణాటకలో మద్దూరు అనే గ్రామం ఉంది. అక్కడ ఉగ్ర నృసింహస్వామి విగ్రహం ఉంది. స్థలపురాణం ఏమి తెలియచేస్తూందంటే అర్జునుడు పరమాత్మని " నీ నృసింహ అవతార రూపాన్ని చూడాలని ఉంది " అని అడుగుతాడు. స్వామి అంటారు " వద్దు. నీ శక్తి సరిపోదు. తట్టుకోలేవు. నువ్వు కోరేవు కనుక ఈ లోహ విగ్రహాన్ని ప్రసాదిస్తున్నాను " అని చెప్పి విగ్రహాన్ని ఇస్తారు. ఆ విగ్రహమే ఆ గ్రామంలో ఉన్నది.
అర్జునుడినే " తట్టుకోలేవు, నీ శక్తి సరిపోదు " అన్నారు అంటే అర్ధం అవుతూంది లోకకంటకుడయిన హిరణ్యకశిపుడిని చంపినప్పుడు స్వామి ఎంత కోపంతో ఉగ్రంతో రగిలిపోయారో అని. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత కూడా స్వామి ఉగ్రంనుంచి బయటపడడానికి చాలా సంవత్సరాలు పట్టిందని మనం చదివాం.
అటువంటి కోపాన్ని ప్రచోదన చేయడానికే సముద్రుడు వేచి చూసారు.
ప్రచోదన అంటే శాంతమే కాదు, కోపం కూడా. అవసరాన్ని, పరిస్థితులను బట్టి ఉంటుంది.
ఏతత్ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏
ReplyDelete