అమ్మవారు మన కళ్ళకు ఎలా కనబడుతారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అదృశ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 649 వ నామం.
" అదృశ్యా " అంటే ఇంద్రియగోచరము కానిది అని భాష్యం చెప్పారు.
మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ అమ్మవారి చైతన్యం ( ఆత్మ ) ఉన్నదని ఉపనిషత్తులు తెలియచేస్తున్నాయి. అన్ని జీవులలోనూ అమ్మవారి చైతన్యం ఉంది. సృష్టిలో ఇంద్రియాలకు గోచరించని జీవులెన్నో ఉన్నాయి అని తెలుస్తూనే ఉంది, రకరకాల రోగాల మూలాన.
ఇది ప్రాణం ఉన్న చరముల (జీవుల) విషయం. మరి అచరముల విషయమేమిటి. పదార్ధాలలో అణువు చిన్నదనుకున్నారు. తరువాత ప్రోటాన్ ఎలక్ట్రాన్ అన్నారు. ప్రోటాన్ లో క్వార్క్స్, ఎలక్ట్రాన్ లో లెప్టాన్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు హిగ్స్ బోసాన్ అన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇది.
కెన్నెత్ ఫోర్డ్ ( హైడ్రోజన్ బాంబ్ ప్రోజెక్ట్ - 1952 సభ్యుడు, ప్రస్తుతవయస్సు 96 ) అనే శాస్త్రజ్ఞుడు అన్నారు " ఎంత చిన్న పదార్ధాన్ని కనుక్కున్నా దానిలో ఎనర్జీ/చైతన్యం ఉంటూంది, ఎంతటి అద్భుత విషయం " అని. అమ్మవారు ( చైతన్యం ) అంత సూక్ష్మరూపంలో ఉంటుంది అని మన ఋషులు తెలియచేయడం ఎంతటి అద్భుతవిషయం.
కఠోపనిషత్తు ఈ ఆత్మని ఇలా వర్ణించింది:
" అణోరణీయాన్మహతో
మహీయాన్ " - 1.2.20
" చాలా చిన్న దాని కంటే చిన్నది, చాలా పెద్ద దాని కంటే పెద్దది " అని. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం. అంటే శరీరమంతా వ్యాపించి ఉండి అన్ని ఇంద్రియములచేత పని చేయిస్తూంది.
ఎంత అద్భుతం మన ఋషుల విద్వత్తు, మన వాజ్మయం. దీనికి సాటి లేదు, రాబోదు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment