ఇంద్రియములు అన్నీ అమ్మవారి ధ్యానంలో ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 672 వ నామం .
" బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ " అంటే చైతన్యము ( తన ) తో జీవునికి ఐక్యము కలిగించుటయే తన నిజస్వరూపముగా గలది. ప్రతీ జీవి అమ్మవారి చైతన్యమే. మళ్ళీ ఈ చైతన్యం అమ్మవారిలో ఐక్యమవడమే ముక్తి. పాపపుణ్యాలు రెండూ నశించిన తరువాతే ముక్తి కలుగుతుంది. దీనికోసం ఎన్నో జన్మలు సాధన చేయాలి. దానికి అమ్మవారి సహకారం ఎలాగూ ఉంటుంది. అమ్మవారు ముక్తిప్రదాత.
సాధన ఎలా ఉండాలంటే అమ్మవారు ఇచ్చిన ఈ సర్వేంద్రియాలు అమ్మవారి ఆరాధనకోసమే అనే భావనతో ఉండాలి.
సర్వేంద్రియాలతో ఎవరు కృష్ణ భక్తిరసాన్ని పానం చేస్తారో ఆ జీవుడిని గోపి అన్నారు. ఈ గోపీ తత్వానికి అధిష్టాన దేవత రాధాదేవి. ఆనందస్వరూపిణి.
మంత్రాలకు అధిదేవతలు ఉంటారు. వేదమంత్రాలు విష్ణువు గురించి తపస్సు చేస్తే ఏమి కావాలి అన్నారు విష్ణువు. " ఎప్పటినుంచో మిమ్మల్ని స్తుతిస్తూనే ఉన్నాం, ఎప్పుడు మేము మీలో ఐక్యమయేది, ఎప్పుడు అనుగ్రహిస్తారు మమ్మల్ని " అంటే కృష్ణావతారంలో గోపికలుగా పుట్టండి అన్నారు. గోపికలకు ఇంకోపేరు ఉపనిషత్కాంతలు. అలాగే అనేక జన్మలుగా పరమాత్మ సాయుజ్యం కోసం తపించిపోతూన్న యోగినులు, యోగులు గోకులంలో గోపికలుగా జన్మించారు. ఆ గోపికలందరినీ ఓ శరద్రాత్రి కృష్ణసాయుజ్యం కలిగించి, రాసలీలలో ప్రవేశింపచేసి, తరింపచేసిన శక్తి రాధాదేవి.
భక్తజయదేవులు గీతగోవిందం అనే అద్భుత కావ్యం రచించారు. దానిలో రాధాదేవి నాయిక - జీవాత్మ. కృష్ణుడు నాయకుడు/సఖి - పరమాత్మ. ఈ సఖి జీవాత్మను ముక్తిపథంలో నడిపించి పరమాత్మలో లీనమయేలా చేస్తుంది. ఇదే గీతగోవిందం సారాంశం.
అలాగ సాధనతో పండిపోయిన జీవాత్మను అమ్మవారే తనలో కలిపేసుకుంటారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment