గోవు, భూమి ఒకరే, గౌరవించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" గోమాతా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 605 వ నామం .
" గోమాతా " అంటే ఆవులకు తల్లియగు సురభిస్వరూపురాలు అని భాష్యం చెప్పారు. గో శబ్దానికి నానార్ధాలు చాలా ఉన్నాయి అందులో ఒక అర్థం భూమి అని.
శ్రీవారాహీదేవి తన కోరలమీద భూదేవిని కూర్చోబెట్టుకుని సదా రక్షిస్తూ ఉంటుంది.
పురాణాలలో భూమి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భూదేవి గోవు రూపంలో రావడం కనబడుతూంటుంది. మనుషులకే కాదు దేవతలకు రాక్షసులకు కూడా భూమే ఆధారం. దేవతలకు కావలసినది యజ్ఞ హవిస్సులు. యజ్ఞం జరిగేది భూమిమీదే. సమిధలు మొ.గునవి ఇచ్చేదీ భూమే.
మహాభాగవతంలో ఓ అద్భుత ఘట్టం ఉంది.
పృధుచక్రవర్తి భాగవతోత్తముడు,
చక్కటి ధర్మపాలన చేస్తున్నారు. అయినా కరువుకాటకాలు వచ్చాయి. కారణం ఏమిటి అని భూమిని నిలదీశాడు పృధువు. భూమి గోవు రూపంలో వచ్చి అంది " నీ తండ్రి అధర్మపాలనే ఈ పరిస్థితికి కారణం. నువ్వు ధర్మపాలన చేస్తున్నావు. నిజమే కాని దాని ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. కాని నువ్వు ధర్మపరుడివి, అడిగావు కనుక నేను నుంచుంటున్నాను. నీకు కావలసినది పితుక్కో/తీసుకో అంది.
గోవునుంచి పాలు పితకాలంటే దూడ, పాత్ర కావాలి. పృధువుకి స్వయంభువ మనువు ( ధర్మం ) దూడగా వచ్చారు. పృధువు పాత్రగా తన దోసిలిని/చేతులను ( కృషిని )ఉపయోగించారు. పాడిపంటలు సమృద్ధిగా కలిగాయి. ఋషులు బృహస్పతిని దూడగానూ, మనస్సు వాక్కు చెవులను పాత్రగా ఉపయోగిస్తే వేదం లభించింది వారికి. దేవతలకు అమృతం లభించింది.
గోవు/భూమి ఇవ్వలేనిది లేదు. అందుకే సనాతనధర్మం గోవు/భూమిని పూజించమంది, గౌరవించమంది. వాటిని రక్షిస్తే అవి అందరినీ రక్షిస్తాయి. వాటిని బాధిస్తే అరిష్టం తప్పదు. ప్రస్తుతపు సమస్యలకు కారణం సులువుగా ఊహించవచ్చు.
ధర్మో రక్షతి రక్షితః
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment