అమ్మవారికి నామము, రూపము ఉండవు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నామరూపవివర్జితా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్య నామాలలో 300 వ నామం .
" నామరూపవివర్జితా " అంటే నామరూపములు లేనిది అని.
నామరూపాలు అశాశ్వతమయిన ఉపాధులకు ఉంటాయి. శాశ్వతమయిన వాటికి ఉండవు. ఆత్మకు నామరూపాలు ఉండవు, దేహానికి ఉంటాయి. నేను అనే ఆత్మను దేహానికి ఆపాదించుకుంటున్నాం. నేను పుట్టాను, చూసాను, తిన్నాను, తిరిగాను, ఇష్టపడ్డాను, బాధపడ్డాను అంటూ.
(జడ) భరతుడు మళ్ళీ జన్మలో జింకగా పుట్టి మరుజన్మలో బ్రహ్మజ్ఞానంతో ప్రపంచాన్ని విస్మరించి భగవత్స్మరణతో గడుపుతున్నాడు. రఘూగణుడు అనే చక్రవర్తి బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికని కపిల మహర్షి ఆశ్రమానికి వెడుతూ అనుకోకుండా జడభరతుడిని కలుస్తాడు. జడభరతుడు బ్రహ్మజ్ఞాని అని గ్రహించి ఓ చక్కటి ప్రశ్న వేస్తాడు రఘూగణుడు.
సాధారణంగా పండితులు చెప్పేది మట్టి శాశ్వతం, కుండ అశాశ్వతం. మట్టిలోంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది కనుక. కాని కుండకు ఓ పరమార్ధం/ప్రయోజనం ఉందికదా. నీరు తెచ్చుకుంటాం, వంట చేసుకుంటాం. అశాశ్వతం అనుకుని విస్మరించడం ఎలా అని. జడభరతుడు అంటాడు " బ్రహ్మధర్మం వేరు. వ్యావహారికధర్మం వేరు. రెండూ కలపకు. బ్రహ్మధర్మం నుంచి చూసినప్పుడు ఈ వ్యావరాహికధర్మాలు ( కుండ లాంటివి ) అశాశ్వతం. కాని వ్యావహారికధర్మాలలోంచి చూసినప్పుడు ఇవన్నీ శాశ్వతంగా కనబడతాయి. అదే మాయ " అని.
బ్రహ్మ(ఆత్మ)ధర్మాలను ఉపాధుల(దేహ) ధర్మాలకు ఆపాదించడం వలననే కలగాపులగం అయిపోయి మోహం ఏర్పడుతుంది, దానివల్ల కర్మలు ఏర్పడతాయి, దానివల్ల జన్మలు ఏర్పడుతున్నాయి. జననమరణ చక్రం తిరుగుతూంది అంటారు జడభరతుడు.
ఉదా: మరణించిన తరువాత తనతో రూపాయి కూడా తీసుకుని వెళ్ళడం వీలుపడదు అని తెలిసినా ఈ సంపదలు శాశ్వతం అనుకుని పది తరాలదాకా సరిపోయేటంత ఉన్నా ఇంకా నానా చెడుపనులూ చేస్తూ సంపాదిస్తూనే ఉంటాడు మనిషి. మహామాయ.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఈ మోహం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment